ఐపీఎల్ 2022 సీజన్‌ను సన్‌రైజర్స్ ఓటమితో ముగించింది. పంజాబ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 15.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో లియాం లివింగ్‌స్టోన్ (49 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


వేగంగా ఆడటంలో విఫలమై...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ను ఎప్పటిలానే ఓపెనింగ్ సమస్య వెంటాడింది. కేన్ విలియమ్సన్ స్థానంలో ఓపెనింగ్ చేసిన ప్రియం గర్గ్ (4: 7 బంతుల్లో) విఫలం అయ్యాడు. అయితే రాహుల్ త్రిపాఠి (20: 18 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), అభిషేక్ శర్మ (43: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.


అయితే ఆ తర్వాత హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వాషింగ్టన్ సుందర్ (25: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రొమారియో షెపర్డ్ (26: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. వీరు వేగంగా ఆడటంతో హైదరాబాద్ చివరి నాలుగు ఓవర్లలో 58 పరుగులు చేసింది. 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.


సులువుగా ఛేదించిన పంజాబ్
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభం అయింది. వేగంగా ఆడే క్రమంలో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో త్వరగానే అవుటైనా... రన్‌రేట్ ఎక్కడా తొమ్మిదికి తగ్గలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా... లియామ్ లివింగ్‌స్టోన్ (49 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు)  వేగంగా ఆడాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 15.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.