ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కుప్పకూలింది. 15.5 ఓవర్లలో కేవలం 97 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (36 నాటౌట్: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై విజయానికి 120 బంతుల్లో 98 పరుగులు కావాలి.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. చెన్నై టాప్ ఆర్డర్ బ్యాటర్లు అత్యంత పేలవమైన ప్రదర్శన చేశారు. మొదటి నలుగురు బ్యాట్స్‌మెన్ కలిపి చేసిన పరుగులు కేవలం ఎనిమిది మాత్రమే. ఐదు పరుగులకే మూడు వికెట్లు, 29 పరుగులకే ఐదు వికెట్లను చెన్నై కోల్పోయింది. డ్వేన్ బ్రేవో, ధోని ఏడో వికెట్‌కు జోడించిన 39 పరుగులే ఇన్సింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. వీరి భాగస్వామ్యం బలపడుతుందనే లోపే కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి బ్రేవో అవుటయ్యాడు.


ఒక ఎండ్‌లో ధోని నిలబడ్డా మరో ఎండ్‌లో వికెట్లు టపటపా పడిపోయాయి. దీంతో చెన్నై 15.5 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో డేనియల్ శామ్స్ మూడు వికెట్లు తీయగా... మెరెడిత్, కుమార్ కార్తికేయ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. రమణ్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రాలు తలో వికెట్ పడగొట్టారు.