IPL Mega Auction 2022, Lucknow Super Giants: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఎంపిక దాదాపుగా పూర్తయింది! వేలంలో క్రికెటర్లను ఎంచుకొనేందుకు ఆ ఫ్రాంచైజీ తెలివిగా ప్రవర్తించింది. ఎంపికలో మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ తెలివైన వ్యూహాలే అమలు చేశాడు! అటు సమతూకం, ఇటు దూకుడు తీసుకొచ్చే క్రికెటర్లు, మ్యాచ్‌ విన్నర్లతోనే జట్టును నిర్మించాడు.


ఎంపిక చేసిన ఆటగాళ్లు - List of LSG players


వేలానికి వచ్చే ముందు కేఎల్‌ రాహుల్‌ (రూ.17 కోట్లు), మార్కస్‌ స్టాయినిస్‌ (రూ.9.2  కోట్లు), రవి బిష్ణోయ్‌ (రూ.4 కోట్లు)ను లక్నో డ్రాఫ్ట్‌ చేసింది. రూ.59 కోట్లతో వేలానికి వచ్చింది. వేలంలో క్వింటన్‌ డికాక్‌ (రూ.6.75 కోట్లు), మనీశ్‌ పాండే (రూ.4.60 కోట్లు), మార్క్‌వుడ్‌ (రూ.7.5 కోట్లు), అవేశ్‌ ఖాన్‌ (రూ.10 కోట్లు), అంకిత్‌ రాజ్‌పుత్‌ (రూ.0.50 కోట్లు), దుష్మంత చమీరా (రూ.2 కోట్లు), షాబాజ్‌ నదీమ్‌ (రూ.0.50 కోట్లు), జేసన్‌ హోల్డర్‌ (రూ.8.75 కోట్లు), దీపక్‌ హుడా (రూ.5.75 కోట్లు), కృనాల్‌ పాండ్య (రూ.8.25 కోట్లు), కృష్ణప్ప గౌతమ్‌ (రూ.0.90 కోట్లు)ను ఎంచుకుంది.


మిగిలిన నిధులు


లక్నో వద్ద ఇప్పుడు 14 మంది క్రికెటర్లు ఉన్నారు. ఇంకా వారి వద్ద రూ.3.50 కోట్లే మిగిలింది. నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ వద్ద కనీసం 18 మంది, గరిష్ఠంగా 25 మంది ఉండాలి. ఇప్పుడు స్వల్ప నిధులతో వారు లోకల్‌ బాయ్‌, సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనాను కొనే అవకాశం ఉంది! ఒకవేళ కాదనుకుంటే మిగిలిన డబ్బులతో యువ బౌలర్లు, బ్యాటర్లు, ఆల్‌రౌండర్లను కొనుగోలు చేయొచ్చు. ఏదేమైనా స్టార్లను కొనేంత డబ్బులైతే ఇప్పుడు లేవు.


బ్యాటింగ్‌ కిర్రాక్‌


ఇప్పుడున్న ఆటగాళ్లతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కోర్‌ గ్రూప్‌ తయారైనట్టే! ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉండటంతో జట్టు అత్యంత సమతూకంగా ఉండే ఛాన్స్‌ ఉంది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్‌  కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ భీకరమైన ఓపెనర్లు. కుడిఎడమ కూర్పు కావడంతో పవర్‌ప్లేలో పరుగుల వరద పారిస్తారు. కీలకమైన వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ వస్తాడు. అతడు ఓపెనింగ్‌ నుంచి ఫినిషర్‌ వరకు అన్ని పాత్రలు పోషిస్తాడు. తన మీడియం పేస్‌తో వికెట్లు తీస్తాడు. నాలుగో స్థానంలో మనీశ్‌ పాండేకు ఛాన్స్‌ ఇస్తారు. ఎందుకంటే గంభీర్‌ నాయకత్వంతో కోల్‌కతాకు అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ట్రోఫీ అందించాడు. 5, 6, 7 స్థానాల్లో దీపక్‌ హుడా, జేసన్‌ హోల్డర్‌, కృనాల్‌ పాండ్య వస్తారు. ఈ ముగ్గురూ ఆల్‌రౌండర్లే. దీపక్‌, కృనాల్‌ స్పిన్ వేస్తారు. హోల్డర్‌ పేస్‌ వేస్తాడు. కృష్ణప్ప గౌతమ్‌, షాబాజ్‌ నదీమ్‌ కూడా పరుగులు చేస్తారు. విచిత్రంగా వీరంతా కుడి, ఎడమ కూర్పుకు సెట్‌ అవుతారు.


స్పిన్‌, పేస్‌కు తిరుగులేదు


బౌలింగ్‌లోనూ సమతూకం కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌ మన దేశంలో పర్యటించినప్పుడు మార్క్‌వుడ్‌ వేసిన వేగానికి టీమ్‌ఇండియా ఉక్కిరిబిక్కిరైంది. అతడు గాయాల పాలవ్వకుండా ఉంటే తిరుగులేదు. స్వదేశీ పేసర్‌గా అవేశ్‌ ఖాన్‌కు ప్రతి మ్యాచులో చోటుంటుంది. గతేడాది అతడు తన బౌలింగ్‌తో అద్భుతాలు చేసిన సంగతి తెలిసిందే. ఉదాహరణకు తుది జట్టులో నలుగురు విదేశీయులు ఉండొచ్చు. స్టాయినిస్‌, హోల్డర్‌, మార్క్‌వుడ్‌, డికాక్‌కు చోటు దొరికితే.. ఇందులో ముగ్గురు పేస్‌ బౌలింగ్ చేస్తారు. అవేశ్‌ పేస్ బౌలింగ్‌ చేస్తాడు. దుష్మంత చమీరా, అంకిత్‌ రాజ్‌పుత్ వారికి తోడుగా ఉంటారు. మిస్టరీ స్పిన్నర్‌ బిష్ణోయ్‌కు తిరుగుండదు. అతడితో పాటు కృనాల్‌, దీపక్‌, కృష్ణప్ప, నదీమ్‌ స్పిన్‌లో వేరియేషన్‌ ప్రదర్శిస్తారు. అన్ని సమీకరణాలు కుదిరితే లక్నో నిజంగానే 'సూపర్‌ జెయింట్‌' అవుతుతుంది.