ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఓటమి. బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిషెల్ మార్ష్ (89: 62 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... డేవిడ్ వార్నర్ (52 నాటౌట్: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. ఈ విజయంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి.


పడుతూ, లేస్తూ...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (7: 11 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే యశస్వి జైస్వాల్ (19: 19 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ (50: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (48: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు.


వీరి తర్వాత వచ్చిన వారంతా విఫలం కావడంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఆన్రిచ్ నోర్జే, మిషెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.


ఎక్కడా తడబడకుండా...
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదటి ఓవర్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికే ఓపెనర్ కేఎస్ భరత్‌ను (0: 2 బంతుల్లో) అవుట్ చేసి బౌల్ట్ మొదటి వికెట్‌ను దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు మిషెల్ మార్ష్ జతకలిశాడు.


మిషెల్ మార్ష్ ఒక ఎండ్‌లో వేగంగా ఆడగా... మరోవైపు డేవిడ్ వార్నర్ తనకు చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ రాజస్తాన్ బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. రెండో వికెట్‌కు 144 పరుగులు జోడించాక విజయానికి చేరువలో మిషెల్ మార్ష్ అవుటయ్యాడు. అయితే రిషబ్ పంత్ (13 నాటౌట్: 4 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను మరింత తొందరగా ముగించాడు. యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీసుకున్నారు.