ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ (50: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 120 బంతుల్లో 161 పరుగులు అవసరం.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (7: 11 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే యశస్వి జైస్వాల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్, దేవ్‌దత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించారు.


వీరి తర్వాత వచ్చిన వారంతా విఫలం కావడంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఆన్రిచ్ నోర్జే, మిషెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌కు ఐపీఎల్‌లో ఇదే మొదటి అర్థ సెంచరీ.