చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. ఇన్ని రోజులు జట్టుకు నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోని పగ్గాలను సర్ జడేజాకు అప్పగించాడు. గత కొన్ని సంవత్సరాలుగా జడేజా అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. 2021 ఐపీఎల్‌లో పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఓవర్‌కు 37 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ ఆల్‌రౌండర్లలో జడేజా ఒకడు. దీంతోపాటు తను ప్రపంచస్థాయి ఫీల్డర్ కూడా.


ఐపీఎల్‌లో తను ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2008 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ కప్ గెలవడంతో జడేజా కీలక పాత్ర పోషించాడు. 2013 ఐపీఎల్‌లో రూ.9.8 కోట్లు చెల్లించి చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను కొనుగోలు చేసింది. అప్పట్నుంచి చెన్నై జట్టులోనే జడేజా ఉన్నాడు. 2013 ఐపీఎల్ వేలంలో అత్యధిక మొత్తం పొందిన ఆటగాడు జడేజానే.







మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జడేజా 2,386 పరుగులు చేసి 127 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 81 క్యాచ్‌లు కూడా అందుకోవడం విశేషం. మొత్తంగా తన స్ట్రైక్ రేట్ 128.07గా ఉంది. 2020 సీజన్‌లో జడేజా స్ట్రైక్ రేట్ 171.85 కాగా... 2021లో 145.51గా ఉండటం విశేషం.


రవీంద్ర జడేజాకు ఇంతవరకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. అయితే వెనక కొండంత అండ ధోని ఉన్నాడు కాబట్టి ఈ టాస్క్ తనకు పెద్ద కష్టం కాబోదు. అయితే ధోని తర్వాత చెన్నైకి పూర్తి స్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపడుతోంది జడేజానే కాబట్టి తనపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.