IPL 2024: కంటెంట్ కటౌట్ ఉన్న క్రికెటర్లు అంటే కచ్చితంగా ధోని(MS Dhoni ) అండ్ కొహ్లీ(Virat Kohli). కెప్టెన్,వైస్ కెప్టెన్ గా ఇద్దరూ కలిసి చిరుతల్లా వేగంగా వికెట్ల మధ్య పరిగెడుతూ టీమిండియాకు అందించిన విజయాలైనా.. ఐపీఎల్ లో ఒకరినొకరు ఢీ కొట్టే సందర్భాలైనా ఫ్యాన్స్ కి కావాల్సింది గుర్తుపెట్టుకునేది మహిరాట్ సంభవం. ఈ సీజన్ తో అంతా మారాయ్. కొహ్లీ ఎప్పుడో కెప్టెన్సీ వదిలేశాడు ఆర్సీబీ బాధ్యతలు డుప్లెసీ చూసుకుంటున్నాడు. చెన్నైకి మ్యాచ్ కి ఒక్క రోజు ముందు ధోని షాక్ ఇచ్చాడు. నాయకుడి బాధ్యతలను ఎంతో ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తున్న రుతురాజు చేతికి అప్పగించాడు. అయినా అభిమానులు ఈ రోజును చెపాక్ స్టేడియాన్ని కమ్మేసేది టీవీలు,మొబైల్స్ కి అతుక్కుపోయేది ధోని కొహ్లీలను చూడటానికే.


ధోనికి బహుశా ఇదే లాస్ట్ సీజన్ అవుతుందన్న టైమ్ లో కెప్టెన్సీ కూడా వదిలేయటంతో ఫ్యాన్స్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇకపై ధోని ప్రతీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాలని. మరోవైపు కొహ్లీ ఈసారి ఎలా అయినా ఐపీఎల్ ట్రోఫీని కొట్టి ఈ యేడు ఆర్సీబీ(RCB) అందుకున్న స్థానాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లాలన్న కసితో రగిలిపోతున్నాడు. సో నాయకులు కాకపోయినా ఈ ఇద్దరి మధ్య ఇవాళ్టి పోరు అభిమానులకు కనువిందు. అంకెలు,గణాంకాలు చూస్తే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ జట్లు 31 సార్లు తలపడితే 20 విజయాలతో చెన్నై ఆధిక్యంలో ఉంది. ఆర్సీబీ పది మాత్రమే గెలిచింది. 2023లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ వంటి వారితో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్ గా కనపడుతుందో...రచిన్ రవీంద్ర(Rachin Ravindra), రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) తో మొదలుపెట్టి లోయర్ మిడిల్ ఆర్డర్ లో ధోనివరకూ చెన్నై కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్, ముకేశ్ చౌదరి లాంటి పేసర్లతో జడ్డూ,శాంట్నర్, తీక్షణ, మొయిన్ అలీ లాంటి స్పిన్నర్లతో చెన్నై బలంగా కనపడుతోంది. చెన్నై ఫైనల్ 11ఎవరు ఆడతారనే క్లారిటీ ఈరోజుతో రానుంది. మహమ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్, లోకి ఫెర్గ్యూసన్ లాంటి స్టార్ బౌలర్స్ తో పాటు మయాంక్ దాగర్, యశ్ దయాల్ లాంటి యంగ్ స్టర్స్ తో ఆర్సీబీ ఉత్సాహంతో ఉంది. చూడాలి మహిరాట్ మ్యాచ్ ఫ్యాన్స్ కి, ఐపీఎల్ 17కి ఎంత కిక్  స్టార్ట్ ఇవ్వనుందో.


ఈసారి కోహ్లీ కొడతాడా?


ఫార్మాట్ తో సంబంధం లేని విరాట్ కొహ్లీ...ఎందులోనైనా కింగ్ కింగే. ఇలా పిలవటం అతనికి ఇష్టం లేకపోవచ్చు. కానీ అభిమానుల దృష్టిలో అతని స్థానం ఎప్పుడూ సింహాసనమే. అలాంటి రారాజుకి ఒక్కటే లోటు. ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా సాధించలేకపోయాడు. పదహారేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. ఇది 17వ సంవత్సరం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుంది పరిస్థితి. పైగా ఈసారి ఆర్సీబీ అమ్మాయిలు డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ షిప్ గెలిచి తొలిసారి ఫ్రాంచైజీకి ట్రోఫీ రుచి చూపించారు. ఇక అబ్బాయిల వంతు.పేరుకు డుప్లెసీ కెప్టెన్ అయినా ఆర్సీబీకి ఐకాన్ అంటే కొహ్లీనే. అందుకే జెర్సీ అన్ బాక్స్ ఈవెంట్ నుంచి ఆర్సీబీ కి సంబంధించిన ప్రతీ విషయంలోనూ అతనుంటాడు. ట్రోఫీ గెలవలేదనే కానీ కొహ్లీ ఐపీఎల్లో లో సెట్ చేసిన రికార్డులు చాలానే ఉన్నాయి. 2016 సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. అందులో ఏకంగా నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకూ మరే ప్లేయర్ కూడా కోహ్లీ సెట్ చేసిన 973 రన్స్ రికార్డును బ్రేక్‌ చేయలేకపోయారు. లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటాన్స్‌ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేసి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినా అతని వల్ల కాలేదు. మరి ఈసారి ఎవరైనా ఆ రికార్డు బీట్ చేస్తారా లేదా కొహ్లీనే తనలోని తోపు బ్యాటర్ ని మళ్లోసారి చూపించి సరదా సరదాగా వెయ్యిపరుగుల మార్క్ కూడా అందేసుకోవాలా. ఫ్యాన్స్ ఏమంటారు మరి.