Jhye Richardson: ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కష్టాలు పెరుగుతున్నాయి. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా అతను 2-3 వారాల పాటు మైదానానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఆస్ట్రేలియన్‌ స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జే రిచర్డ్‌సన్‌ను రూ.1.5 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది.


జే రిచర్డ్‌సన్ ఔట్
బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ గాయపడ్డాడు. అతనికి హ్యామ్‌స్ట్రింగ్ సమస్య ఏర్పడింది. ఈ కారణంగా అతను రాబోయే రెండు, మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉండవలసి ఉంటుందని తెలుస్తోంది. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఆడిన జే రిచర్డ్‌సన్ గాయం గురించి ఆ జట్టు కోచ్ ఆడం వోగ్స్ తెలిపాడు. 'మా జట్టు బిగ్ బాష్ లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంటే, ఆ సమయానికి అతను తిరిగి జట్టులోకి వస్తాడు' అన్నాడు. మరి గాయం తీవ్రత గురించి తెలియాల్సి ఉంది.


రిచర్డ్‌సన్ గాయం గురించి సమాచారం ఇచ్చేటప్పుడు కోచ్ వోగ్స్ మాట్లాడుతూ, 'అతని స్నాయువులో కొంచెం సమస్య ఉంది, అది కోలుకోవడానికి రెండు నుండి మూడు వారాలు పట్టవచ్చు. టోర్నీ ముగిసేలోపు అతను పూర్తిగా కోలుకుంటాడని మేము ఆశిస్తున్నాము. మాకు ప్రపంచ స్థాయి వైద్య సిబ్బంది ఉన్నారు. అతను వీలైనంత త్వరగా మైదానంలోకి తిరిగి వస్తాడని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం.’ అన్నాడు.


రూ.కోటిన్నరకు కొన్న ముంబై ఇండియన్స్
2023లో జరగనున్న ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 1.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఎల్‌కు ముందు అతని గాయం ముంబైకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. రిచర్డ్‌సన్ కంటే ముందు కామెరాన్ గ్రీన్ కూడా గాయపడ్డాడు. ఈ ఇద్దరు ఆటగాళ్ల గాయం ముంబైకి కష్టాలను పెంచింది.