ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కచ్చితంగా ఉంటుంది. నాలుగు సార్లు టైటిల్‌ గెలిచిన ఈ ఫ్రాంచైజీకి రికార్డులు బద్దలుకొట్టడం, సృష్టించడం కొత్తేమీ కాదు. తాజాగా సీఎస్‌కే ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. భారత్‌లో బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన మొదటి క్రీడా యూనికార్న్‌గా చరిత్ర సృష్టించింది.


ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ మార్కెట్‌ విలువ రూ.7,600 కోట్లకు చేరుకుంది. గ్రే మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.210-215 వరకు పలుకుతోంది. ఇదే కాకుండా సీఎస్‌కే మరో రికార్డూ బద్దలు కొట్టింది. తన మాతృసంస్థ ఇండియా సిమెంట్స్‌ కన్నా ఎక్కువ మార్కె్‌ట్‌ విలువను సంపాదించింది. ఇండియా సిమెంట్స్‌ మార్కెట్‌ విలువ ఇప్పుడు రూ.6,869 కోట్లే కావడం గమనార్హం.


ఐపీఎల్‌లోకి మరో రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడంతో సీఎస్‌కే మార్కెట్‌ విలువ ఒక్కసారిగా పెరిగింది. సంజీవ్‌ గోయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్‌జీ బృందం లక్నో సూపర్‌ జెయింట్స్‌ను రూ.7000+ కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇక అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్‌ రూ.5,625 కోట్లకు తీసుకుంది. కొత్త వాటికే భారీ ధర పలకడంతో ఇప్పటికే విజయవంతమైన సీఎస్‌కే షేర్ల ధర భారీగా పెరిగింది. గతేడాది ఐపీఎల్‌ ఫైనల్స్‌కు ముందు సీఎస్‌కే షేరు ధర రూ.110-120 మధ్యన ఉండేది. ఇంకా చెప్పాలంటే మూడు నెలల క్రితం రూ.90-100 మధ్యే ఉంది. ఇక 2018, నవంబర్లో రూ.12-15గా ఉన్న షేరు ధర 2000 శాతం ర్యాలీ అయ్యి ఇప్పటి ధరకు చేరుకుంది.


'ఇండియా సిమెంట్స్‌ బ్రాండ్‌ను సీఎస్‌కే బ్రాండ్‌ వెనక్కి నెట్టేస్తుంది. అమెరికాలో ఫ్రాంచైజీ ఆధారిత లీగుల చరిత్ర గమనించండి. అవెంతో అభివృద్ధి చెందాయి. భారత్‌లో క్రికెట్‌ను విపరీతంగా ప్రేమిస్తారు. కాలం గడిచే కొద్దీ దేశాల మధ్య క్రికెట్‌ కన్నా ఫ్రాంచైజీ క్రికెట్‌కే ఆదరణ పెరుగుతుంది' అని ఈ మధ్యే ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాస్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.


Also Read: IPL 2022: ఎంఎస్‌ ధోనీ CSK పగ్గాలు వదిలేస్తున్నాడా? మరి 'సింహం' చెన్నైలో ఎందుకు దిగినట్టు?


Also Read: Ravi Shastri News: రవిశాస్త్రి 2.0? ఆ మాటల వెనక అర్థమేంటి?


ఐపీఎల్‌ పదిహేనో సీజన్లోనూ చెన్నైని ఎంఎస్ ధోనీయే నడిపిస్తాడని అంటున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌కు వీడ్కోలు పలకనంత వరకు అతడే నాయకుడిగా ఉంటాడని చెబుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌ వేలం గురించి చర్చించేందుకు ధోనీ చెన్నైకి చేరుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు.


'కెప్టెన్సీ మార్పుపై ఇప్పటి వరకు చర్చే జరగలేదు. సమయం వచ్చినప్పుడు వంతెన దాటుతాం! ఇప్పటికైతే ధోనీయే మా కెప్టెన్‌. సీఎస్‌కేలో మొదటి ఆటగాడు అతడే. నిజంగా దిగిపోవాలని అనుకుంటే అతడే నిర్ణయం తీసుకుంటాడు. మేమిప్పుడు వేలం పైనే ఫోకస్ చేస్తున్నాం. ఉదాహరణ తర్వాత ఉదాహరణగా నిలుస్తున్న ధోనీ గురించి మీరు మాట్లాడుతున్నారు. అతడు కావాలనే తొలి ప్రాధాన్య రీటెన్షన్‌ను జడ్డూకు ఇచ్చేశాడు. ప్రతిసారీ శిబిరానికి అందరికన్నా ముందే వస్తాడు. అతడు దృఢంగా ఉన్నాడు. మరోసారి టైటిల్‌ అందిస్తాడు. సీజన్‌ మధ్యలోనే అతడెందుకు రిటైర్‌ అవుతాడు? సరైన సమయంలో సరైన నిర్ణయాలే తీసుకుంటాం' అని సీఎస్‌కే వర్గాలు అంటున్నాయి.


ధోనీ గురువారం రాత్రి చెన్నై నగరానికి చేరుకున్నాడు. పదిహేను రోజుల పాటు అక్కడే ఉంటాడని తెలిసింది. రాబోయే పదేళ్లకు జట్టుకు సేవలందించే ఆటగాళ్లను తీసుకొనేందుకు చెన్నై వ్యూహాలు రచిస్తోంది. ఇవన్నీ ధోనీ నేతృత్వంలోనే సాగనున్నాయి.