India sports women: ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆట ఎప్పుడూ అందలం ఎక్కిస్తుంది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినా వాళ్లను సూపర్‌స్టార్లను చేస్తుంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తుంది. కొందరు వైకల్యాన్ని ధిక్కరిస్తే మరికొందరు విధిని ఎదిరించి గెలుపు బాటలో నడిచారు. అందుకే కమింగ్‌  జనరేషన్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి స్ఫూర్తిదాయక కథలు మీకోసం!


అవని లేఖరా


11 ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై జైపూర్‌కు చెందిన అవని కింది శరీరం చచ్చుబడిపోవడంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైంది. ఆమె జీవితం అక్కడితో ఆగిపోయిందని అంతా భావించారు. అవని మాత్రం ఆత్మవిశ్వాసంతో తన లైఫ్‌ను రీస్టార్ట్ చేశారు.  ఈ 19 ఏళ్ల యువతి పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి మహిళగా నిలిచింది. R-2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో, ఆమె 2020 టోక్యో పారాలింపిక్స్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది. 2015 నుంచి శిక్షణ తీసుకున్న ఆమెకు ఇదే మొదటి ప్రధాన అంతర్జాతీయ పతకం.


మీరాబాయి చాను


2020 టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్న మీరాబాయి చాను భారతదేశపు పవర్ లేడీ. ఆమె 2016 రియో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసింది. మల్లీశ్వరి తర్వాత 22 సంవత్సరాలలో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన రెండవ భారతీయురాలు. మీరాబాయి తన మొట్టమొదటి పోటీ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నప్పుడు ఆమెకు కేవలం 11 ఏళ్లు. మణిపూర్ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఆమె సమీపంలోని కొండపై నుంచి కట్టెలు సేకరించే పనిలో పడ్డప్పుడు ఆమె బలాన్ని కుటుంబం గుర్తించింది. మీరాబాయి పద్మశ్రీ (2018) మరియు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు (2018) గ్రహీత.


పివి సింధు


2013 మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఆమె విజయం సాధించినప్పటి నుంచి, పివి సింధు పేరు భారతదేశంలో బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా ఉంది. 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలు. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి సింధు. హైదరాబాద్‌లో క్రీడా కుటుంబంలో జన్మించిన ఈ 26 ఏళ్ల యువతి ఇప్పుడు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 7వ ర్యాంక్‌లో నిలిచింది.


హిమ దాస్


2018లో ఫిన్‌లాండ్‌లోని టాంపేర్‌లో జరిగిన IAAF వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్ (స్ప్రింట్ రన్నర్) హిమ దాస్. తర్వాత జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం, రజత పతకాలను కైవసం చేసుకుంది. ఆమె 400 మీటర్లలో 50.79 సెకన్లతో భారత జాతీయ రికార్డును కలిగి ఉంది. అసోంలోని డింగ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక వరి రైతు కుమార్తె. హిమ దాస్ 18 సంవత్సరాల చిన్న వయస్సులో ఇండియన్ ఐకాన్‌గా మారింది. 2019లో 20 రోజుల్లో 5 బంగారు పతకాలు గెలుచుకుంది. 


జూలై 2, పోజ్నాన్: 200మీ స్వర్ణం (23.65 సెకన్లు)
జూలై 7, కుంటో: 200మీ స్వర్ణం (23.97 సెకన్లు)
జూలై 13, క్లాడ్నో: 200మీ స్వర్ణం (23.43 సెకన్లు)
జూలై 17, టాబోర్: 200మీ స్వర్ణం (23.25 సెకన్లు)
జూలై 20, ప్రేగ్: 400మీ స్వర్ణం (52.09 సెకన్లు)


మేరీ కోమ్


చుంగ్నీజాంగ్ మేరీ కోమ్ హ్మాంగ్టే మణిపూర్‌కు చెందిన భారతీయ ఒలింపిక్ బాక్సర్. ఆరుసార్లు ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (AIBA)లో గౌరవనీయమైన నంబర్ 1 స్థానాన్ని సాధించిన ఏకైక మహిళ ఆమె. మొత్తం ఏడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకం సాధించిన ఏకైక మహిళా బాక్సర్ కూడా కోమ్, ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. 'మాగ్నిఫిసెంట్ మేరీ'గా పేరుగాంచిన ఆమె అనేక అంతర్జాతీయ వేదికలపై మెరుస్తూ భారతదేశానికి ఇష్టమైన క్రీడాకారిణిగా మారింది.


శైలీ సింగ్


సరైన షూ లేకుండా తన కెరీర్‌ను ప్రారంభించిన క్రీడాకారిణి శైలీ సింగ్. 2021లో అండర్-18 యూత్ లాంగ్ జంప్‌లో వరల్డ్ నంబర్ 1 టైటిల్‌ గెలుచుకుంది. ఆమె ఝాన్సీలో జన్మించింది. జీవితంలో అనేక కష్టాలను అధిగమించిన ఈ అమ్మాయికి లాంగ్ జంప్ పిట్ వెన్నతోపెట్టిన విద్య. బెంగళూరులోని అంజు బాబీ జార్జ్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందింది. U-18 లాంగ్ జంపర్‌ల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 ర్యాంకర్‌లలో శైలి ఇప్పుడు ఒకరు.