KCR vs Etela Rajender: ఇప్పటివరకు జరిగిన సమావేశాల కంటే ఈసారి జరగనున్న తెలంగాన అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.. టీఆర్ఎస్‌లో కీలక నేతగా వ్యవహరించిన ఈటల రాజేందర్ ఆ పార్టీని వీడి తరువాత హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ప్రతి అంశంలోనూ అటు టీఆర్ఎస్ పార్టీని ఇటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరు ఉన్న రాజా సింగ్, రఘునందన్ రావులకు కొత్త ఎమ్మెల్యే ఈటల అదనపు బలం అవుతారు.


దూకుడు పెంచిన ఈటల రాజేందర్..  
తనను అవమానకరంగా పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత దూకుడు పెంచిన ఈటల రాజేందర్ (Etela Rajender) ఎన్నికల విజయం తరువాత బీజేపీని  రూట్ లెవెల్లో బలపడేలా చేస్తున్నారు. ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో పాటు మంత్రిగా కూడా ప్రతి అంశంపై గట్టి పట్టున్న ఈటల రాజేందర్ అసెంబ్లీలో ఏం మాట్లాడతారో అని ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఆర్ఆర్ఆర్ (ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్) సినిమా చూపిస్తారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో వేడి వేడిగా చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగిన తీరు, ఈటల విజయం అందుకు కారణాలుగా చెప్పవచ్చు.


గతంలో టీఆర్ఎస్‌ పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధించిన ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అవమానకర రీతితో ఈటలను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయడం, ఆయన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన అభిమానులతో పాటు నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి.


ఈటల గెలుపు ప్రస్థానం
2004లో తొలిసారిగా కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఈటల పోటీ చేశారు. ఆయనకు 68,393 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డికి 48,774 ఓట్లు రావడంతో ఈటలకు 19,619 ఓట్ల మెజార్టీ దక్కింది. 2008లో మరోసారి కమలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయనకు 54,092 ఓట్లు, ముద్దసాని దామోదర్ రెడ్డికి 31,808 ఓట్లు వచ్చాయి. ఈసారి  ఈటల మెజార్టీ 22,284కి పెరిగింది. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసిన ఈటల.. హుజూరాబాద్ నుంచి 2009లో ఉప ఎన్నికల్లో పోటీచేయగా 56,752 ఓట్లు పోల్ కాగా, కృష్ణమోహన్ వకులాభరణంకు 41,717 ఓట్లు వచ్చాయి. 15 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ దక్కింది.


2010 ఉప ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు 93,026 ఓట్లు రాగా, ముద్దసాని 13,799 ఓట్లకు పరిమితమయ్యారు. 79,227 ఓట్ల భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ విజయ ఢంకా మోగించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 95,315 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డికి 38278 ఓట్లు వచ్చాయి. ఈసారి 57,037 ఓట్ల మెజార్టీ దక్కింది. 2018 ఎన్నికల్లో ఈటలకు 1,04,840 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు పడ్డాయి. ఈటల మెజార్టీ 43,719 గా ఉంది. 


కీలకమైన ఉప ఎన్నిక..
రెండు దశాబ్దాలపాటు కొనసాగిన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి తొలిసారి బీజేపీ నుంచి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఈటలకు 1,06,213 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,348 ఓట్లు పోల్ కావడంతో ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో బీజేపీ నుంచి సైతం విజయాన్ని అందుకున్నారు. తనను అవమానించిన సీఎం కేసీఆర్‌ను బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్న ఎమ్మెల్యే ఈటల మధ్య ఎలాంటి చర్చ చోటుచేసుకుంటుందా అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు..


Also Read: Health Profile Telangana: దేశంలోనే తొలిసారిగా ములుగులో ఈ-హెల్త్ ప్రొఫైల్, ప్రారంభించిన హరీశ్ - దీంతో మనకి ఎన్ని లాభాలో!


Also Read: KCR: చంద్రబాబు బాటలో సీఎం కేసీఆర్‌, ఆ వ్యూహం ఈయనకైనా పని చేస్తుందా?