IND T20 Squad for WI Tour: వెస్టిండీస్‌తో టీ20 సిరీసులో విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయాల నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ పునరాగమనం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే జట్టుపై సెలక్టర్లు ఒక అంచనాకు వచ్చారని సమాచారం. బహుశా గురువారం సాయంత్రం లేదా శుక్రవారం జట్టును ప్రకటిస్తారని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.


ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ (Virat Kohli) పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా సిరీసులో అతడికి విశ్రాంతినిచ్చారు. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచుకు ఎంపిక చేసినా పరుగులేమీ చేయలేదు. టీ20 సిరీసులోనూ రాణించలేదు. వన్డేల్లోకి ఎంపిక చేద్దామంటే గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే వెస్టిండీస్‌తో టీ20 సిరీసులో (India tour of West Indies) విరాట్‌కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఏదేమైనా ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో అతడు ఉన్నాడని సెలక్టర్లు ధ్రువీకరించారు.


Also Read: వేదిక మారింది.. మరి మ్యాచ్ టైమ్‌? లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్టింగ్‌ వివరాలు ఇవీ!


Also Read: అదీ లెక్క! ఒక్క మ్యాచుతో NO-1కు బుమ్రా!!


వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీసు జులై 29 నుంచి మొదలవుతుంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్‌ కీట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.


విండీస్‌తో టీ20 సిరీసుకు టీమ్‌ఇండియా అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌


విండీస్‌తో వన్డే సిరీసుకు గత వారమే టీమ్‌ఇండియాను ప్రకటించారు. శిఖర్‌ ధావన్‌ జట్టును నడిపిస్తాడని సెలక్టర్లు ప్రకటించారు. రవీంద్ర జడేజా అతడికి డిప్యూటీగా ఉంటాడని పేర్కొన్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, రిషభ్ పంత్‌, షమి, హార్దిక్‌ పాండ్యకు రెస్ట్‌ ఇచ్చారు.