సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే జులై చివరివారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా యూనివర్సిటీలు యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రక్రియను మొదలుపెట్టాయి. యూనివర్సిటీ ఆఫ్ ముంబయి ఇప్పటికే ప్రవేశ ప్రకటక విడుదల చేసింది. ఇదే బాటలో ఇతర యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు ఆలస్యం అవుతున్న తరుణంలో యూనివర్సిటీలు ఈ మేరకు ప్రవేశ ప్రక్రియ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు జారీచేసింది.


యూజీసీ కీలక ఆదేశాలు..
12వ తరగతి ఫలితాలు ఆలస్యం అవుతుండటం, కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే ప్రవేశ ప్రక్రియ చేపట్టడం లాంటి పరిణామాల నేపథ్యంలో దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీచేసింది. సీబీఎస్‌ఈ ఫలితాల తర్వాతే ప్రవేశాల కోసం చివరి తేదీలను ప్రకటించాలని కోరింది.


కోవిడ్ కారణంగా 12వ తరగతి పరీలక్షలను టర్మ్-1, టర్మ్-2 గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టర్మ్-1 ఫలితాలను సంబంధిత పాఠశాలలకు చేరవేర్చామని.. టర్మ్-2 ఫలితాల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. టర్మ్-1, టర్మ్-2 మదింపు, వెయిటేజీ పరిగణనలోకి తీసుకుని తుది ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుందని.. ఇందుకు కొంత సమయం పడుతోందని యూజీసీ తెలిపింది.


యూనివర్సిటీలు ఫలితాల వెల్లడికే మందుగానే ప్రవేశాలకు చివరితేది ప్రకటిస్తే.. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సీటు పొందే అవకాశం కోల్పోతారని, ఈ కారణంగా ఫలితాల వెల్లడి తర్వాతే ప్రవేశాలకు చివరి తేదీలను ప్రకటించాలని తెలిపింది.