దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటనపై సందిగ్ధం నెలకొంది. షెడ్యూలు ప్రకారం డిసెంబర్‌ 9న టీమ్‌ఇండియా ఛార్టర్ విమానం ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆటగాళ్లకు ఎలాంటి సమాచారం లేదు. పైగా పర్యటించే జట్టునూ ఇంకా ప్రకటించలేదు. సఫారీ దేశానికి వెళ్లేందుకు భారత ఆటగాళ్లు జంకుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది!


ఒమిక్రాన్‌ వేరియెంట్‌ మొదట దక్షిణాఫ్రికాలోనే వెలుగు చూసింది. అక్కడి నుంచి దేశ విదేశాలకు పాకేస్తోంది. తాజాగా భారత్‌కూ వచ్చేసింది. ఈ వేరియెంట్‌ కారణంగా దక్షినాఫ్రికాలో కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పర్యటించేందుకు కొందరు ఆటగాళ్లు జంకుతున్నారని తెలిసింది. అక్కడికి వెళ్లలేమనీ చెబుతున్నారట. తమకు ఆందోళనగా ఉందని అంటున్నారట.


'అవును.. ఆటగాళ్లు నిజంగానే ఆందోళన చెందుతున్నారు. కాస్త నిరాకరిస్తున్నారు కూడా! దక్షిణాఫ్రికా పర్యటనపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే ముందు ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఏదేమైనా షెడ్యూలు ప్రకారమే పర్యటన జరుగుతుందని ఆశిస్తున్నాం. మరో 24-48 గంటలు వేచిచూస్తే తుది నిర్ణయంపై మరింత స్పష్టత వస్తుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.


టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'మనం సాధారణ పరిస్థితుల్లోనైతే ఆడటం లేదు. ప్రతి సిరీసు విషయంలో ఎంతో ప్రణాళిక, సన్నద్ధత ఇమిడి ఉంటాయి. ఇప్పుడు జట్టులో లేని ఆటగాళ్లు త్వరలో క్వారంటైన్‌లోకి అడుగు పెడతారు. ఛార్టర్‌ ఫ్లైట్‌ ఎక్కేందుకు బయో బుడగలోకి వస్తారు' అని కోహ్లీ అన్నాడు.


'దక్షిణాఫ్రికా పర్యటనపై త్వరలోనే స్పష్టత వస్తుందని అనుకుంటున్నాం. జట్టులోని సీనియర్లు అందరితో మాట్లాడాం. జట్టు సభ్యులతో రాహుల్‌ భాయ్ చర్చ మొదలు పెట్టారు. నిజానికి ఇదెంతో కీలకం' అని విరాట్‌ పేర్కొన్నాడు. కాగా ఈ విషయాలపై దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం ప్రతినిధులు స్పందించారు.


'వేర్వేరు వేదికల ద్వారా మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. బీసీసీఐ ఇంకా మమ్మల్ని సంప్రదించలేదు. అందుకే వదంతులుగా అంచనా వేస్తున్నాం. మేం ప్రతిరోజూ బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారి నుంచి ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రత్యేకంగా ఛార్టర్‌ విమానాలు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారమే పర్యాటక జట్టు వస్తుందని అనుకుంటున్నాం' అని సీఎస్‌ఏ ప్రతినిధి మొసెకి అంటున్నారు.


Also Read: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?


Also Read: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?


Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!


Also Read: శ్రేయస్‌నూ కరుణ్‌ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?


Also Read: రెండో టెస్టు నుంచి రహానే, జడేజా, ఇషాంత్ శర్మ ఔట్.. బీసీసీఐ ప్రకటన


Also Read: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్‌ తాజా కోటీశ్వరులు వీరే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి