ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్‌లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. వన్డేల్లో గత 26 మ్యాచ్‌ల్లో ఓటమే లేకుండా సాగుతున్న ఆస్ట్రేలియా విజయాల పరంపరకు బ్రేక్ పడింది. నిజానికి భారత్ రెండో వన్డేలోనే గెలుపు అంచుల వరకు చేరుకున్నా చివర్లో తడబడి ఓటమి పాలైంది. అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా యాష్లే గార్డ్‌నర్ (67: 62 బంతుల్లో, 8 ఫోర్లు, రెండు సిక్సర్లు), తహ్లియా మెక్‌గ్రాత్ (47: 32 బంతుల్లో, 7 ఫోర్లు), బెత్ మూనీ (52: 64 బంతుల్లొ, ఆరు ఫోర్లు) రాణించడంతో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజ వస్త్రాకర్ మూడేసి వికెట్లు తీయగా, స్నేహ్ రాణా ఒక వికెట్ తీసింది.


Also Read: కుర్రాళ్ల దూకుడు మంత్రం.. ధోనీ సేనపై ఏంటి కోల్‌కతా తంత్రం!


అనంతరం బ్యాటింగ్ చేసిన మొదట్లో షెఫాలీ వర్మ (56: 91 బంతుల్లో, 7 ఫోర్లు), యస్టికా భాటియా (64: 69 బంతుల్లో, 9 ఫోర్లు) రాణించడంతో 29 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే తర్వాత 48 పరుగుల తేడాతోనే ఐదు వికెట్లు నష్టపోయింది. అయితే చివర్లో దీప్తి శర్మ (31: 30 బంతుల్లో, 3 ఫోర్లు), స్నేహ్ రాణా (30: 27 బంతుల్లో, ఐదు ఫోర్లు) రాణించడంతో భారత్ తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది.


విజయానికి ముంగిట వీరిద్దరూ అవుటయినా జులన్ గోస్వామి(8 నాటౌట్: 7 బంతుల్లో, ఒక ఫోర్), మేఘనా సింగ్ (2: 3 బంతుల్లో) మ్యాచ్‌ను ముగించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అనబెల్ సదర్లాండ్ మూడు వికెట్లు తీయగా, నికోలా కేరీ, స్టెల్లా క్యాంప్‌బెల్ యాష్లే గార్డ్‌నర్, సోఫీ, తహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు. మూడు వికెట్లు తీయడంతో పాటు విన్నింగ్ షాట్ కొట్టిన జులన్ గోస్వామికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ విజయం సాధించినా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సిరీస్‌ను భారత్ 2-1తో కోల్పోయింది.


2001లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు వరుసగా 16 టెస్టు మ్యాచ్‌ల విన్నింగ్ స్ట్రీక్‌ను టీమిండియా బ్రేక్ చేసింది. అలాగే 2008లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు వరుసగా 16 మ్యాచ్‌లు గెలిచి.. 17వ మ్యాచ్ భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ సంవత్సరం బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో 32 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాకు భారత్ ఓటమి రుచి చూపింది. ఈ విజయాన్ని కూడా ఇప్పుడు వాటితో పోలుస్తుండటం విశేషం.


Also Read: సన్‌రైజర్స్ ఇంటికే.. ఐదు పరుగులతో పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ!


Also Read: రద్దయిన టెస్టు మళ్లీ జరిగే అవకాశం.. ఎప్పుడంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి