ప్రపంచకప్‌ ముగిసి వారమైనా కాలేదు మళ్లీ పొట్టి క్రికెట్‌ మజా మొదలవుతోంది! ప్రియమైన శత్రువు న్యూజిలాండ్‌ మన దేశంలో పర్యటిస్తోంది. మూడు మ్యాచుల్లో భాగంగా తొలి టీ20ని జైపుర్‌ సవాయ్‌ మాన్‌సింగ్‌ మైదానంలో ఆడుతోంది. మరి ఈ సిరీస్‌ ప్రత్యకతేంటి? బలాబలాలు ఎలా ఉన్నాయి?


ప్రత్యేకత ఏంటి?


న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ టీమ్‌ఇండియాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్‌గా నియామకం అయ్యారు. భారత క్రికెట్‌ చరిత్రలో ఇదో నవోధ్యాయం కానుంది. వ్యక్తి, క్రికెటర్‌, కోచ్‌గా ద్రవిడ్‌కు మంచి పేరుంది. పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా రోహిత్‌కు అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ముంబయిని అతడు ఐదుసార్లు గెలిపించాడు. పైగా మరో 11 నెలల్లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌నకు ఇది అంకురార్పణ!


ఆధిపత్యం ఎవరిది?



  • టీ20ల్లో ఈ రెండు జట్లు 17 సార్లు తలపడ్డాయి.

  • కివీస్‌ 9 మ్యాచులు గెలిచింది.

  • భారత్‌ 6 గెలిచింది.

  • రెండింట్లో ఫలితం తేలలేదు.

  • ఉపఖండంలో మాత్రం టీమ్‌ఇండియాదే పైచేయి.


భారత్‌ బలాలేంటి?



  • రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కావడం. ద్రవిడ్‌ కోచ్‌గా రావడం.

  • కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తుండటం.

  • వెంకటేశ్ అయ్యర్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. హార్దిక్‌ పాండ్య స్థానాన్ని అతడి భర్తీ చేయనున్నాడు.

  • ఫియర్‌లెస్‌ క్రికెట్‌ వైపు అడుగులు వేస్తామని ద్రవిడ్‌ ప్రకటించడం.

  • రాహుల్‌, రోహిత్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యం.

  • సూర్య, శ్రేయస్‌, ఇషాన్‌, రుతురాజ్‌, పంత్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండటం.

  • భువీ, అక్షర్‌, సిరాజ్‌, యూజీ, అశ్విన్‌తో బౌలింగ్‌ బలంగా ఉండటం.

  • సొంత దేశంలో ఆడుతుండటం.


భారత్‌ బలహీనతలు?



  • విరాట్‌ కోహ్లీ, బుమ్రా, షమి అందుబాటులో లేకపోవడం.

  • కుర్రాళ్లు, సీనియర్లతో కూర్పు సులువు కాదు.

  • మొదట బ్యాటింగ్‌లో తక్కువ స్కోరు చేయడం.

  • చాలామందిపై బుడగ ఒత్తిడి ఉండటం.

  • కుర్రాళ్లు ఒత్తిడిని ఏ మేరకు అధిగమిస్తారో తెలియదు.

  • ఐపీఎల్‌ నుంచి నేరుగా ఎంపికవ్వడం.


కివీస్‌ ఎలా ఉందంటే?


ఇక న్యూజిలాండ్‌ పరిస్థితీ టీమ్‌ఇండియాలాగే ఉంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, సీనియర్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అందుబాటులో ఉండటం లేదు. వీరిద్దరికీ భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. కీపర్‌ టిమ్‌ సీఫెర్ట్‌కు టీమ్‌ఇండియాపై మంచి సగటు ఉంది. గప్తిల్‌కూ మన బౌలర్లపై ఆడిన అనుభవం ఉంది. స్పిన్‌ను బాగా ఎదుర్కొనే డేవాన్‌ కాన్వే లేకపోవడం కివీస్‌ లోటు. సమష్టిగా ఆడటం కివీస్‌ బలం. కొన్నేళ్లుగా ఆ జట్టుకు రెగ్యులర్‌గా 20-25 మందిని ఆడిస్తోంది. జిమ్మీ నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, ఫెర్గూసన్‌, సోధికి భారత్‌లో ఆడిన అనుభవం ఉంది.


మంచు కీలకం?


పిచ్‌ బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంది. పెద్ద మైదానం కావడంతో స్పిన్నర్లు వికెట్లు తీసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్‌ బౌలర్ల కన్నా స్పిన్నర్ల సగటు, ఎకానమీ మెరుగ్గా ఉంది. పేసర్లు చక్కని బంతులు వేసేందుకు పరిస్థితులు బాగుంటాయి. ఎడారి ప్రాంతం కావడంతో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.