భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన దగ్గర ఉన్న ఒక ఎక్స్‌ట్రా బ్యాట్‌ను శ్రీలంక క్రికెటర్‌కి కానుకగా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 




మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ని 2-1తో కైవసం చేసుకున్న భారత్ టీ20లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన తొలి T20లో భారత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం లంకలో పర్యటిస్తోన్న భారత యువ జట్టుకు గబ్బర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. 


తొలి T20కి ముందు మైదానంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత్-లంక ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు కాసేపు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో భారత ఆటగాడు ఇషాన్ కిషన్ డ్రస్సింగ్ రూమ్ నుంచి ఒక బ్యాట్ తీసుకువచ్చి పాండ్యకు ఇస్తాడు. దాన్ని తీసుకున్న పాండ్య శ్రీలంక ఆటగాడు చమిక కరుణరత్నేకు ఇచ్చాడు. పాండ్యకు ధన్యవాదాలు చెబుతూ చమిక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 






లంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో, ఆదివారం జరిగిన T20లో హార్దిక్ పాండ్య ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు వన్డేల్లో కలిపి 19 పరుగులు చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. తొలి T20లో పది పరుగులు చేసి ఒక వికెట్ దక్కించుకున్నాడు.  


శ్రీలంక జాతీయ గీతం పాడుతూ...


మూడు T20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్-శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు మైదానంలోకి వచ్చి జాతీయ గీతాన్ని ఆలపించాయి. ఈ సమయంలో శ్రీలంక జాతీయ గీతం ఆలపించే సమయంలో హార్దిక్ పాండ్య కూడా పాడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. 






 


నెజిటన్ల సెటైర్లు


పాండ్య శ్రీలంక జాతీయ గీతం పాడుతూ ఉన్న వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నీ ప్రదర్శన వల్ల ఇంగ్లాండ్ వెళ్లే జట్టులో చోటు కోల్పోయావు... ఇప్పటి నుంచైనా సరిగ్గా ఆడు, నీ కంటే జట్టులోకి కొత్తగా వచ్చిన కుర్రోళ్లు బాగా ఆడుతున్నారు. వారి కోసం నీ స్థానం త్యాగం చెయ్యి... అలా జట్టుకు హెల్ప్ చెయ్యి అంటూ నెటిజన్లు కామెంట్లు జత చేశారు.