ఓ పక్క కోర్‌ కమాండర్ల స్థాయి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నా చైనా కవ్వింపు చర్యలు మాత్రం ఆగటంలేదు. తాజాగా దెమ్‌చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం గుడారాలను వేసినట్లు సమాచారం. దీంతో భారత సైన్యం అక్కడి వారిని ప్రశ్నించగా.. తాము చైనా పౌరులమని చెప్పినట్లు తేలింది. దీంతో సైన్యం వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వారు అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం.


వాస్తవానికి నేడు ఇరు దేశాల మధ్య కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. కార్గిల్‌ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాలు ఉండటంతో భారత్‌ దీనిని వాయిదా వేసింది. అదే సమయంలో ఈ గుడారాలు ప్రత్యక్షం కావడం గమనార్హం.


1990ల్లో ఏర్పాటు చేసిన ఇండో చైనా జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌.. దెమ్‌చోక్‌, ట్రిగ్‌హైట్స్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవలే భారత్‌ నార్తన్‌ కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. సరిహద్దులకు దళాల చేరవేతలు జరుగుతున్నా.. ఇరుపక్షాలు ముఖాముఖీ తలపడేంత ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుషూల్‌ వద్ద ఏర్పాటు చేసిన హాట్‌లైన్ల ద్వారా చైనా దళాలతో వివిధ అంశాలపై సంప్రదింపులు, సమన్వయం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 1500 సార్లు హాట్‌ మార్గంలో సందేశాలు ఇచ్చిపుచ్చుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. భారత్‌ పూర్తిగా 2019 నాటి పరిస్థితులు నెలకొల్పాలని కోరుతుండగా.. చైనా మాత్రం దళాలను శాంతి సమయాల్లో మోహరించే చోట్ల ఉంచితే చాలని అంటోంది.


భారీ మోహరింపులు..


చైనాను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్‌ చర్యలు చేపడుతోంది. ఈమేరకు సరిహద్దుల వద్ద డ్రాగన్‌ చర్యల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అదనంగా 50 వేల మంది సైనికుల్ని, యుద్ధ విమానాల్ని చైనా సరిహద్దుల వద్ద భారత్‌ మోహరించినట్లు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో భారత సైనికులు 2 లక్షల మంది పహారా కాస్తున్నారు. ఇది 2020 నాటి లెక్కలతో పోలిస్తే 40 శాతం కన్నా అధికం. ఇదివరకు చైనా ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా సైనిక మోహరింపులు ఉండేవి. అయితే ఆ విధానానికి స్వస్తి పలుకుతూ భారత్‌ ముందుకుసాగుతోంది. డ్రాగన్‌ సైన్యాన్ని అడ్డుకోవడమే కాకుండా.. అవసరమైతే దాడి చేసేలా భారత్‌ వ్యవహరిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ ఓ నివేదికలో పేర్కొంది.


సరిహద్దుల్లోకి మరిన్ని బలగాలను మోహరించడం ద్వారా.. హిమాలయాల్లో చైనాను ఢీకొట్టేలా సైనికులు అలవాటు పడేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రఫేల్‌ సహా, ఫైటర్‌ జెట్లను సైతం చైనా సరిహద్దు వెంబడి మూడు విభిన్న ప్రాంతాలకు తరలించారు. సముద్ర మార్గం గుండా చైనా నుంచి బయటకొచ్చే వనరులు, వాణిజ్య పరమైన అంశాలపై నిఘా ఉంచేందుకు భారత నావికాదళం సైతం యుద్ధ నౌకల్ని మోహరిస్తోంది. గల్వాన్‌ లోయలో గతేడాది జరిగిన ఘర్షణ అనంతరం డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనా వ్యూహాత్మక ఎత్తుగడలు, భవిష్యత్తులో ఆ దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత నిర్ణయం దోహదం చేస్తుందని సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసర్చ్‌ సీనియర్‌ సభ్యుడు, యేల్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సుశాంత్‌సింగ్‌ అన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది.


ప్రస్తుతం భారత్‌తో సరిహద్దుల వెంట చైనా సైన్యం ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. అయితే సరిహద్దుల వెంట మోహరించిన దళాలు, కార్యకలాపాల్ని చైనా పెంచినట్లు భారత్‌ గుర్తించింది. కొత్త రన్‌వేలు, ఎయిర్‌ ఫీల్డులు, బంకర్ల నిర్మాణం సహా ట్యాంకులు, ఫైటర్‌ జెట్‌లను చైనా మోహరిస్తోంది. కొన్ని నెలలుగా దీర్ఘశ్రేణి ఫిరంగి, ట్యాంకులు, రాకెట్‌ రెజిమెంట్లు, ట్విన్‌ ఇంజిన్‌ ఫైటర్లను చైనా మోహరించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. ఇరు దేశాలు ఇదే తీరులో ఎక్కువ సంఖ్యలో బలగాలను మోహరించడం ప్రమాదమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.