WTC Final 2023, Ajinkya Rahane: 


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 69.4 ఓవర్లకు 296 పరుగులకు హిట్‌మ్యాన్‌ సేన ఆలౌటైంది. దాంతో ప్రత్యర్థి ఆసీస్‌కు 173 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు, శుక్రవారం అజింక్య రహానె (89 బ్యాటింగ్‌; 129 బంతుల్లో 11x4, 1x6) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో హాఫ్‌ సెంచరీ అందుకొన్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (51; 109 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ బాదేశాడు.  వీరిద్దరూ ఏడో వికెట్‌కు 145 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం అందించారు. కమిన్స్‌ 3, స్టార్క్‌, బొలాండ్‌, గ్రీన్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.




రెండో బంతికే శ్రీకర్‌ ఔట్‌


మూడో రోజు, శుక్రవారం 151/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో టీమ్‌ఇండియా ఆట ఆరంభించింది. ఒక పరుగు వచ్చిందో లేదో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కేఎస్ భరత్‌ (5) ఔటయ్యాడు. స్కాట్‌ బొలాండ్‌ వేసిన 38.2వ బంతికి ఔటయ్యాడు. ఆరో స్టంప్‌లైన్‌లో వచ్చిన బంతి అతడి బ్యాటు లోపలి అంచుకు తగిలి వికెట్లను ఎగరగొట్టింది. ఇలాంటి డిఫికల్ట్‌ సిచ్యువేషన్లో క్రీజులో నిలిచిన  అజింక్య రహానె (29) అదరగొట్టాడు. ప్రపంచంలోని గొప్ప బ్యాటర్లలో తానొకడిని అని చాటుకున్నాడు. చక్కని స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను అటాక్‌ చేశాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 92 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకొన్నాడు. చివరి డబ్ల్యూటీసీ ఫైనల్లోని తన స్కోరు (49)ని దాటేశాడు.




అజింక్య.. సెంచరీ మిస్‌!


అజింక్య రహానెకు తోడుగా శార్దూల్‌ ఠాకూర్ నిలబడ్డాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో అతడి చేతికి వరుసగా రెండుసార్లు బంతి తగిలింది. నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియోల సాయం తీసుకొని మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అప్పట్నుంచి వేగంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మరోవైపు రహానె టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దాంతో 60 ఓవర్లకు 260/6తో టీమ్‌ఇండియా లంచ్‌కు వెళ్లింది.


శార్దూల్‌ హాఫ్‌ సెంచరీ




భోజన విరామం నుంచి రాగానే టీమ్‌ఇండియాకు వరుస షాకులు తగిలాయి. పరుగులేమీ జత చేయకుండానే అజింక్య రహానె ఔటయ్యాడు. కమిన్స్‌ వేసిన 61.6వ బంతికి అతడు పెవిలియన్‌ చేరాడు. అప్పటి వరకు ఈజీ క్యాచులు వదిలేసిన ఆసీస్‌.. ఈ క్యాచ్‌ను మాత్రం వదల్లేదు. గల్లీలో కామెరాన్‌ గ్రీన్ అమేజింగ్‌గా అందుకున్నాడు. అప్పటికి స్కోరు 261. దాంతో వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. మరో 10 పరుగులకే ఉమేశ్ యాద్‌ (5)ను కమిన్సే పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన శార్దూల్‌ 108 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే జట్టు స్కోరు 294 వద్ద గ్రీన్‌ బౌలింగ్‌లో కేరీకి క్యాచ్‌ ఇచ్చాడు. మహ్మద్‌ షమి (13) ఎక్కువ సేపు నిలవలేదు.