IND W vs PAK W: మ‌హిళ‌ల వన్డే ప్రపంచక‌ప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయంతో భారత్ బోణీ కొట్టింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగ‌నూయి వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 107 పరుగుల తేడాతో పాక్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఛేజింగ్ చేయడానికి దిగిన పాక్ మహిళలు 43 ఓవర్లలో 137 ఆలౌట్ అయ్యారు.


బ్యాటింగ్‌లో సూపర్
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ సేన అదరగొట్టింది. కానీ ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ ఖాతా తెరవకుండానే పెవిలిన్ బాట పట్టింది. డయానా బేగ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చివరి బంతికి షెఫాలీ క్లీన్ బౌల్డ్ అయింది. అయితే మరో  ఓపెనర్ స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), పూజా వస్త్రాకర్ (67; 59 బంతుల్లో 8 ఫోర్లు), స్నేహ్ రాణా  (53; 48 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.


ఛేజింగ్‌లో పాక్‌‌కు వణుకు..
245 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళలు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి వికెట్‌కు 28 పరుగుల భాగస్వామ్యం జోడించాక జవేరియా ఖాన్ (11)ను రాజేశ్వరి గైక్వాడ్ ఔట్ చేసింది. పాక్ ఓపెనర్ సిద్రా అమీన్ (30) టాప్ స్కోరర్ కాగా, డయానా బేగ్ (24) చివర్లో పరుగులు రాబట్టింది. రాజేశ్వరి 4 వికెట్లు తీయగా, గోస్వామి, స్నేహ్ రాణా చెరో వికెట్లు దక్కించుకున్నారు. వరుస విరామాల్లో పాక్ మహిళలు వికెట్లు సమర్పించుకోవడంతో 43 ఓవర్లలో 137కి చాపచుట్టేశారు. దాంతో భారత్ భారీ విజయంతో వరల్డ్ కప్ లో బోణీ కొట్టింది.










మిథాలీ రాజ్ వరల్డ్‌కప్‌ల రికార్డ్..
మౌంట్ మౌంగనూయి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా భారత కెప్టెన్ మిథాలీ రాజ్ నిలిచింది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్‌ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకూ 5 వరల్డ్ కప్‌లలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.   2000, 2005, 2009, 2013, 2017 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు ఆడిన మిథాలీ తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్‌తో మొత్తం 6 వరల్డ్ కప్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.