విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ధోనితో కలిసి మైదానంలో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ తనకు డిప్యూటీగా ఉన్న టైమ్‌లో తన కెరీర్‌లో ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా ‘7 + 18’ అని పెట్టి దాని పక్కన హార్ట్ సింబల్‌ను ఉంచాడు. దీంతో కోహ్లీ త్వరలో రిటైర్‌మెంట్ ప్రకటించనున్నాడని అభిమానులు భయపడుతున్నారు.


రిటైర్ అవుతాడా?
విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు మాత్రమే. తన ఫిట్‌నెస్‌ను కూడా దృష్టిలో ఉంచుకుంటే ఇంకో ఐదారేళ్ల కెరీర్ తన ముందు ఉందని చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో విరాట్ ముందు వరుసలో ఉంటాడు. డైట్, వర్కవుట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటాడు.


ఒక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ సామర్థ్యం గురించి అనుమానించాల్సిన అవసరమే లేదు. కానీ 2019 నుంచి తన కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు కొట్టే కోహ్లీ ఇప్పుడు 100 కొట్టి మూడేళ్లు దాటిపోయింది. అయితే ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఇలాంటి దశ ఉంటుంది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి వారు కూడా దీనికి అతీతులేమీ కాదు. కాబట్టి విరాట్ కోహ్లీ ఇప్పుడే రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం అయితే లేదు.


తన పోస్టులో పేర్కొన్నట్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌లో ఎన్నో భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఒక్క పరుగు ఉన్నచోట రెండు పరుగులు రాబట్టడం, రెండు పరుగులను మూడు పరుగులు చేస్తూ చాప కింద నీరుగా భాగస్వామ్యాలు ఏర్పరచడం వీరి స్పెషాలిటీ.


ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఫొటో 2016 టీ20 వరల్డ్ కప్ నాటిది. ఆ మ్యాచ్‌లో విరాట్ 51 బంతుల్లోనే 82 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఆరు వికెట్లతో టీమిండియాను గెలిపించాడు. ఆ సమయానికి కోహ్లీ తన కెరీర్‌లో పీక్ ఫాంలో ఉన్నాడు.


ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ ప్రస్తుతం సన్నద్ధం అవుతున్నాడు. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం. గత సంవత్సరం ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్లతో దారుణంగా పరాజయం పాలైంది. ఆ తర్వాత రెండు జట్లూ తలపడటం ఇదే మొదటిసారి.