భారత్‌(Team India), ఇంగ్లాండ్‌ (England) మధ్య అయిదు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌(Hyderabad)లోని ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో గురువారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న రెండు జట్లు ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. భారత్‌లో మరోసారి సిరీస్‌ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్‌ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. సొంతగడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ ఓడి 11 ఏళ్లు గడిచిపోయాయి. కానీ చివరగా ఓడింది ఇంగ్లాండ్‌ చేతిలోనే.  2012లో సిరీస్‌ను త‌న్నుకుపోయిన ఇంగ్లండ్‌ను ఈసారి గ‌ట్టి దెబ్బ కొట్టాల‌ని టీమిండియా ప‌ట్టుద‌లతో ఉంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభం ముందు ఇరు జట్లు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీలు కోహ్లీని రెచ్చగొట్టాలని సూచించాడు. ఇప్పుడు టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా కూడా తనదైన శైలిలో బెన్‌ స్టోక్స్‌ సేనను హెచ్చరించాడు.

 

నాపై మీ వ్యూహం పనిచేయదన్న బుమ్రా

ఇంగ్లీష్ ఆట‌గాళ్లు బాజ్ బాల్ ఆట‌తో త‌న‌పై పైచేయి సాధించ‌లేర‌ని బుమ్రా స్పష్టం చేశాడు. బాజ్ బాల్ ఆట‌తో చెల‌రేగుతున్న ఇంగ్లండ్‌కు అభినంద‌న‌లు తెలుపుతూనే ఆ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. తాను ఒక బౌల‌ర్‌గా ఎప్పుడూ పై చేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తానని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడి తనను అల‌స‌ట‌కు గురి చేయ‌లేరని అన్నాడు. బ్రిటీష్‌ జట్టు వికెట్లు వికెట్లు ప‌డ‌గొట్టి తాను బ‌దులిస్తానని హెచ్చరించాడు. మైదానంలో ప‌రిస్థితుల‌ను తనకు అనుకూలంగా ఎలా మ‌ల‌చుకోవాలో తెలుసని బుమ్రా అన్నాడు. 

 

అబుదాబి నుంచి నేరుగా...

భారత్‌, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుండగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లోని ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా టెస్ట్ సిరీస్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించిన రోహిత్ సేన పట్టుదలగా ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఎగబడగా ఆ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (England Cricket board)ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. హలో హైదరాబాద్.. ఇది ముత్యాల నగరం అంటూ పోస్ట్‌కు కామెంట్‌ పెట్టింది.

 

ఉప్పల్‌ స్టేడియంలో భారీ ఏర్పాట్లు

భారత్‌-ఇంగ్లాండుతో తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 నుంచి 29 వరకు రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, రాచకొండ పోలీసులు సమన్వయంతో భద్రత, పార్కింగ్‌, మిగతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేశారు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సిరాజ్‌, బుమ్రా, శ్రేయస్‌, శుభ్‌మన్‌ ఆటగాళ్లు సాధనలో పాల్గొన్నారు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు.