Cricket World Cup 2023:  వచ్చే ఏడాది పాక్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలపై... క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.  ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని.. తమను ఎవరూ శాసించలేరని అన్నారు.


కొన్నాళ్లు కిందట బీసీసీఐ కార్యదర్శ జైషా... పాక్ లో జరిగే ఆసియా కప్ లో భారత్ ఆడబోదంటూ వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికలపైనే భారత్, పాకిస్థాన్ తో తలపడుతుందని.. ఆ దేశంలో పర్యటించే అవకాశం లేదని అన్నారు. జైషా వ్యాఖ్యలపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా అప్పుడే స్పందించారు. మళ్లీ ప్రస్తుతం ఆయన పీసీబీ చీఫ్ హోదాలో అధికారికంగా ఈ విషయంపై మాట్లాడారు. భారత్, పాక్ లో ఆసియా కప్ ఆడకుంటే... పాకిస్థాన్ 2023 లో భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ లో ఆడదని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. 


‘‘భారత్‌, పాక్‌ బోర్డుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై సరైన సమయంలో తప్పకుండా స్పందిస్తాం. అయితే ప్రపంచ క్రీడల్లోనే అత్యంత శక్తిమంతమైన దేశం భారత్‌. ఇతర దేశాలు ఏవీ మాపై అధికారం చెలాయించలేవు’’ అని అనురాగ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో అన్ని దేశాలు పాల్గొంటాయని గతంలోనే అనురాగ్‌ తెలిపారు. ఇది బీసీసీఐ అంతర్గత విషయమని, సరైన దిశగానే పరిష్కారమవుతుందని వెల్లడించారు.


వారు రాకపోతే మేం వెళ్లం: రమీజ్ రజా


'గత కొంతకాలంగా పాకిస్థాన్ నాణ్యమైన క్రికెట్ ఆడుతోంది. భారత్ ను రెండుసార్లు ఓడించింది. వాళ్లు ఆసియా కప్ కోసం ఇక్కడకు రాకపోతే.. మేం ప్రపంచకప్ ఆడడానికి అక్కడకు వెళ్లం. ప్రపంచకప్ లో పాక్ ఆడకపోతే ఆ టోర్నీని ఎవరు చూస్తారు? మేం ఆటలో దూకుడు విధానాన్ని అనుసరిస్తున్నాం. మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. జట్టు మంచి ఆట ఆడితే పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. బిలియన్ డాలర్ల ఎకానమీ కలిగిన బోర్డు ఉన్న జట్టును పాక్ నెలల వ్యవధిలో రెండుసార్లు ఓడించింది.' అని రమీజ్ రజా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 


2009లో పాకిస్థాన్ లోని గడాఫీ మైదానం వెలుపల శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం.. ఆ దేశంలో క్రికెట్‌ ఆడటం ప్రపంచ దేశాలు మానేశాయి. అక్కడ 2009లో నిర్వహించిన ఆసియా కప్పే చివరి అంతర్జాతీయ లీగ్.  ఆ తర్వాత పరిస్థితులు మారటంతో 2015లో జింబాబ్వే, 2017లో శ్రీలంక అక్కడ పర్యటించాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కూడా ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడింది.