జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌  తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో అదరగొట్టాడు. తొలి వన్డేలో సాయి.. 43 బంతుల్లోనే 9 బౌండరీల సాయంతో 55 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయడం ద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు.  తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేయడం ద్వారా సాయి వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్‌ తరఫున తొలి వన్డే ఆడుతూ హాఫ్‌ సెంచరీ సాధించిన 17వ బ్యాటర్‌గా తన పేరు లిఖించుకున్నాడు.  తొలి వన్డే ఆడుతూ ఓపెనర్‌గా అర్ధ సెంచరీ చేసిన నాలుగో భారత ఓపెనర్‌గానూ రికార్డు సృష్టించాడు. గతంలో రాబిన్‌ ఊతప్ప, కెఎల్‌ రాహుల్‌, ఫియాజ్‌ ఫజల్‌లు ఆడిన తొలి వన్డేలోనే  అర్ధ శతకం సాధించిన ఓపెనర్లుగా రికార్డు నెలకొల్పారు. ఆ జాబితాలో తాజాగా సాయి సుదర్శన్‌ చేరాడు. 

తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్‌ దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022 సీజన్‌లో గుజరాత్‌ తరఫున ఆడింది ఐదు మ్యాచ్‌లే అయినా 145 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఏకంగా 13 మ్యాచ్‌లు ఆడి 46.09 సగటుతో ఏకంగా 507 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌ ఏ మ్యాచ్‌లలో కూడా సాయి నిలకడగా ఆడుతున్నాడు. 

 

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు భారత్ పేసర్ల ధాటికి  విలవిల్లాడింది. యువపేసర్లు అర్ష్‌దీప్‌సింగ్‌, ఆవేశ్‌ఖాన్‌ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లో 116 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఫెలుక్వాయో ఒక్కడే 33 పరుగులతో  ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ టోనీ డి జోర్జి 28 పరుగులు చేశాడు. తొలి ఓవర్‌ నుంచే భారత్‌  పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.అయిదు వికెట్లు తీసి అర్ష్‌దీప్‌ ప్రోటీస్‌ పతనాన్ని శాసించాడు. ఆవేశ్‌ఖాన్‌ కూడా నాలుగు వికెట్లతో రాణించాడు. ప్రొటీస్‌ జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే అవుటయ్యారు. సొంతగడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ కేవలం 16.4 ఓవర్లో రెండు వికెట్ల కోల్పోయి విజయాన్ని అందుకుంది. 

 

ఈ మ్యాచ్‌ తర్వాత టీమిండియా స్టార్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సాయి సుదర్శన్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా సాయి సుదర్శన్‌ రూపంలో భారత్‌కు భవిష్యత్‌ స్టార్‌ దొరికాడని, టీమిండియాకు అతడే ‘నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌’ అంటూ ప్రశంసలు కురిపించాడు. నమ్మకం కుదరకుంటే తన వ్యాఖ్యలను రాసిపెట్టుకోమని కూడా స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడు. రాసిపెట్టుకోండి. ఈ కుర్రాడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని సాయి సుదర్శన్‌ను అశ్విన్‌ పొగడ్తలతో ముంచేశాడు. 2021లో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అరంగేట్రం చేసినప్పట్నుంచీ ఇప్పటివరకూ అతడు వెనుదిరిగి చూసుకోలేదని గుర్తు చేశాడు. వన్డే అరంగేట్ర మ్యాచ్‌లోనే తానెంటో నిరూపించుకున్న సాయిసుదర్శన్‌ భవిష్యత్‌ స్టార్‌ అంటూ పొగిడేశాడు. అశ్విన్‌తో పాటు సాయి కూడా తమిళనాడుకు చెందినవారే.