అతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘనవిజయం సాధించింది. జొహెన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో... టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు భారత్ పేసర్ల ధాటికి  విలవిల్లాడింది. యువపేసర్లు అర్ష్‌దీప్‌సింగ్‌, ఆవేశ్‌ఖాన్‌ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లో 116 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో  ఫెలుక్వాయో ఒక్కడే 33 పరుగులతో  ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ టోనీ డి జోర్జి 28 పరుగులు చేశాడు. తొలి ఓవర్‌ నుంచే భారత్‌  పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.అయిదు వికెట్లు తీసి అర్ష్‌దీప్‌ ప్రోటీస్‌ పతనాన్ని శాసించాడు. ఆవేశ్‌ఖాన్‌ కూడా నాలుగు వికెట్లతో రాణించాడు. ప్రొటీస్‌ జట్టులో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే అవుటయ్యారు. సొంతగడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్‌  కేవలం 16.4 ఓవర్లో రెండు వికెట్ల కోల్పోయి విజయాన్ని అందుకుంది. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌  తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అర్థ శతకంతో రాణించాడు. సఫారీ బౌలర్లలో. ముల్డర్‌, ఫెలుక్వాయో చెరో వికెట్ తీశారు. 


మ్యాచ్ లో తొలి ఓవర్‌ నుంచే భారత్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. రెండో ఓవర్‌లోనే వరుసగా రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ సఫారీలను కోలుకోలేని దెబ్బ తీశాడు. 1.4 ఓవర్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హెండ్రిక్స్‌ను అర్ష్‌దీప్‌ బౌల్డ్ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని  హెండ్రిక్స్‌ వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వాండర్‌ డసెన్‌ను అర్ష్‌దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అర్ష్‌దీప్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడబోయిన డసెన్‌ ఎల్బీ అయ్యాడు. అంపైర్‌ ఔట్‌ ఇచ్చినా.. డసెన్‌ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. సమీక్షలో ‘అంపైర్స్‌ కాల్‌’ రావడంతో డసెన్‌కు నిరాశ గా  వెనుదిరిగాడు.దీంతో మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సఫారీలు కష్టాల్లో పడ్డారు.

 

ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది. జట్టు స్కోరు 42 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఈ వికెట్‌ కూడా అర్ష్‌దీప్‌ ఖాతాలోనే పడింది. ఎనిమిదో ఓవర్లో భారీషాట్‌ కొట్టబోయిన జోర్జి వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కి అవుటయ్యాడు. ఓపెనర్‌ జోర్జి 28 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో 42 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కాసేపటికే అర్ష్‌దీప్‌ మరో వికెట్‌ తీసి సఫారీలను మరింత కష్టాల్లోకి నెట్టాడు. పదో ఓవర్‌ చివరి బంతికి ఆరు పరుగులు చేసిన క్లాసెన్‌ను అర్ష్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ వికెట్‌తో అర్ష్‌దీప్‌ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. 52 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్‌ను కోల్పోయింది.అనంతరం ఆవేశ్‌ఖాన్... ప్రొటీస్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. వరుసగా రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు. పదకొండో ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు.

క్లాసెన్‌ను బౌల్డ్‌ చేసిన ఆవేశ్‌ఖాన్‌.. ఆ తర్వాతి బంతికే ముల్దర్‌ను వికెట్ల ముందు దొరకబుచుకున్నాడు. దీంతో 58 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ను నష్టపోయింది. కాసేపటికే మరో వికెట్‌ తీసిన ఆవేశ్‌ఖాన్‌ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను త్వరగా ముగింపు పలికాడు. అవేశ్ వేసిన బంతిని ఆడబోయిన కేశవ్ షార్ట్‌ కవర్‌లోని రుతురాజ్‌ చేతికి చిక్కాడు. దీంతో 73 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. అవేశ్‌ ఖాన్‌కు నాలుగో వికెట్‌ దక్కింది. తొలి నాలుగు వికెట్లు అర్ష్‌దీప్‌సింగ్‌ తీయగా... తర్వాతి నాలుగు వికెట్లు ఆవేశ్‌ఖాన్‌ తీశాడు.