కొత్త సంవత్సరం రాబోతుంది. మరో సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. క్రికెట్‌ చరిత్రలోనే 2023 సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈసారి వన్డే ప్రపంచకప్‌నకు మన దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఏడాది క్రికెట్‌లో ఎన్ని మధుర జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలను టీమిండియాకు ఎదుర్కొంది. 


మరి కొన్నిరోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా ఎన్నో రికార్డులను చూశాము. వీటితో పాటు చెరగిపోని జ్ఞాపకాలు, మరిచిపోని చేదు అనుభవాలను కూడా చూశాం. ఈ ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ- గౌతం గంభీర్‌ మధ్య జరిగిన గొడవ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు గౌతమ గంభీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. కోహ్లీతో అఫ్గానిస్థాన్‌ ఆటగాడు నవీనుల్‌ హక్‌ కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఈ వరుస వివాదాలతో మైదానం మొత్తం హీటెక్కిపోయింది. అయితే కొన్ని నెలల తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లి-నవీనుల్‌ మధ్య నెలకొన్న మనస్ఫర్థలకు ఎండ్ కార్డ్ పడింది. 


లెజెండ్‌ క్రికెట్‌ లీగ్‌లో మాజీ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్‌- శ్రీశాంత్‌ల మధ్య జరిగిన గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. గంభీర్‌ తనను ఫిక్సర్‌ అంటూ పదే పదే పిలిచాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీశాంత్‌ షేర్‌ చేసిన వీడియో కలకలం రేపింది. ప‌క్కన ఉన్న వాళ్లు అత‌డిని ఆపుతున్నా కూడా అత‌డు ఫిక్సర్ అని పిలుస్తూనే ఉన్నట్లు వీడియోలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఈ విష‌యంలో త‌న త‌ప్పేమీ లేద‌ని తెలిపాడు. కానీ గంభీర్‌ మద్దతుదారులు మాత్రం గంభీర్‌ అన్నది ఫిక్సర్ కాదని సిక్సర్‌, సిక్సర్‌ అన్నాడని చెబుతున్నారని ఇది ఆమోదయోగ్యం కాదని శ్రీశాంత్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే శ్రీశాంత్‌కు లెజెండ్‌ లీగ్ క్రికెట్ నిర్వాహకులు లీగల్‌ నోటీలుసు జారీ చేశారు. గంభీర్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీశాంత్‌కు నిర్వాహకులు నోటీసులు జారీ చేశారు. శ్రీశాంత్ వ్యవహారంపై లెజెండ్‌ లీగ్ క్రికెట్ నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు. టీ 20 టోర్నమెంట్‌లో ఆడే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించినందుకు శ్రీశాంత్‌కు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోలను తొలగిస్తేనే.. అతడితో మాట్లాడతామని లెజెండ్‌ క్రికెట్‌ లీగ్‌ నిర్వాహకులు స్పష్టం చేశారు.


ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఏంజెలో మ్యాథ్యూస్‌ టైమ్డ్‌ అవుటయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. మాధ్యూస్‌ను టైమ్డ్‌ అవుట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. 42 బంతుల్లో 41 పరుగులు చేసిన సదీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ మాధ్యూస్‌ బ్యాటింగ్‌కు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో అతడిని అంపైర్‌ టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించాడు. వికెట్ పడిన తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ 3 నిమిషాల్లోపు తదుపరి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే అతను టైమ్డ్‌ అవుట్‌ అవుతాడు. ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని షకీబ్ అప్పీల్ చేశాడు. దాంతో అంపైర్లు సమయం సరిచూసి అవుట్‌గా ప్రకటించారు. 
 2023 ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగ నిలిచింది. అయితే ట్రోఫీ గెలిచిన ఆనందంలో సంబరాలు చేసుకోవాల్సిన ఆసీస్ ఆటగాళ్లలో ఒకడైన మిచెల్‌ మార్ష్‌ శ్రుతి మించాడు. ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. అది కూడా చేతిలో మందు సీసా పట్టుకొని మరీ కూర్చున్నాడు. ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారడం వల్ల అతడిని పెద్ద ఎత్తున్న విమర్శించారు చాలామంది. ఈ విషయంపై అతడిపై పోలీస్‌ కేసు కూడా నమోదైంది.