Sarfaraz Khan, Dhruv Jurel get BCCI's central contracts: యువ క్రికెట‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan), ధ్రువ్ జురెల్‌(Dhruv Jurel)లను అదృష్టం వరించింది. ఇంగ్లండ్ సిరీస్‌లో  రెచ్చిపోయిన వీళ్ల‌కు బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్కింది.  ఈ ఇద్ద‌రికీ భార‌త క్రికెట్ బోర్డు తాజాగా  ‘సీ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఖ‌రారు చేసింది.బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం త‌ర్వాత జురెల్, స‌ర్ఫ‌రాజ్‌ల‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టన వెలువ‌డింది. ఈ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ద‌క్క‌డంతో జెరెల్, స‌ర్ఫ‌రాజ్‌లు ప్రతి ఏటా  రూ. 1 కోటి రూపాయ‌లు ఆర్జించ‌నున్నారు.

 

ఇంగ్లండ్‌తో జ‌రిగిన రాజ్‌కోట్ టెస్టు(Rajkot Test)లో జురెల్, సర్ఫ‌రాజ్‌లు ఇద్దరు  అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లోనే స‌ర్ఫ‌రాజ్ త‌న బ్యాట్ ప‌వ‌ర్‌ చూపించగా,  మ‌రోవైపు జురెల్ ఏడో స్థానంలో బ‌రిలోకి దిగి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తరువాత  రాంచీ టెస్టులో జురెల్ చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడు.  హాఫ్ సెంచ‌రీ(96)తో జ‌ట్టును పోటీలో నిలిపి,  శుభ్‌మ‌న్ గిల్‌ తో  కలిసి భార‌త్ సిరీస్ విజ‌యంలో భాగ‌మ‌య్యాడు.  దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), శ్రేయస్స్‌ అయ్యర్‌(Shreyas iyer)పై బీసీసీఐ(BCCI) కొరఢా ఝుళిపించిన విషయం తెలిసిందే .  ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది.

 



బీసీసీఐ నజరాన

మరోవైపు టెస్టు క్రికెట్‌ను ఎక్కువ మంది క్రికెటర్లు ఆడేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఒక సీజన్‌లో కనీసం 50 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడితే  30 లక్షల నుంచి 45 లక్షలు అదనంగా చెల్లిస్తామని జై షా ప్రకటించారు. రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు ఇందులో సగం ఇస్తామని ప్రకటించారు. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి... ఆటగాళ్లను ప్రోత్సహించడానికి.. ఈ అద్భుత స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు బీసీసీఐ ఒక్కో సీజన్‌కు అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది.  కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి క్రికెటర్లు.. టెస్టు క్రికెట్‌ను కాదని ఐపీఎల్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

 

నాలుగు గ్రేడ్‌లు

బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులో నాలుగు గ్రేడ్స్‌ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు యేటా రూ. 7 కోట్లు... ఏ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్ల వేతనం దక్కుతోంది. సీ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు వార్షిక వేతనం కింద కోటి రూపాయలు అందుతున్నాయి. టెస్టు మ్యాచ్‌లు ఆడినందుకు గాను ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, వన్డేలు ఆడితే రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు దక్కుతాయి.

 

సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా A+ జాబితాలో నిలవగా రాహుల్‌, గిల్‌, సిరాజ్‌ గ్రేడ్‌ Aకు పదోన్నతి పొందారు. రిషబ్‌ పంత్‌ B గ్రేడ్‌లో ఉన్నాడు. టీ20 స్టార్‌ రింకూసింగ్, హైదరాబాద్ ఆటగాడు తిలక్‌వర్మ కొత్తగా గ్రేడ్‌ Cలో చోటు దక్కించుకున్నారు. నిర్దేశించిన వ్యవధిలో కనీసం మూడు టెస్టులు కాని, 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే వారిని కూడా గ్రేడ్‌ C లో చేరుస్తారు. ఈ కాంట్రాక్టులు అక్టోబర్‌ 1, 2023 నుంచి సెప్టెంబర్‌ 30, 2024 వరకు అమలులో ఉంటాయి. ఫాస్ట్‌ బౌలింగ్‌ కాంట్రాక్టును బీసీసీఐ కొత్తగా సిఫార్సు చేసింది. దీనిలో ఆకాశ్‌దీప్‌, విజయ్‌కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యశ్‌ దయాల్‌, విద్వాంత్‌ కావేరప్ప ఉన్నారు.  ఇప్పుడు తాజాగా యువ క్రికెట‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ లకు భార‌త క్రికెట్ బోర్డు తాజాగా  ‘సీ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఖ‌రారు చేసింది