Rohit Sharma Injury: దక్షిణాఫ్రికా(South Africa) తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియా(Team India)ను వరుస గాయాలు ఆందోళన పరుస్తున్నాయి. భారత్‌ (Bharat)వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup) లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఇప్పటికే గాయం కారణంగా టెస్ట్‌ సిరీస్‌కు దూరమవ్వగా.. ఇషాన్‌ కిషన్‌ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. మరోవైపు ఆకస్మికంగా విరాట్‌ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ మ్యాచ్‌ ఆరంభానికి వారం రోజుల ముందు స్వదేశానికి వచ్చాడు. ఇప్పుడు రోహిత్  శర్మ(Rohit Sharma) గాయపడడం టీమిండియాను ఆందోళన పరుస్తోంది. ప్రాక్టీస్‌లో రోహిత్‌ ఎడమ చేయి బొటనవేలికి గాయమైంది. దీంతో తొలి టెస్టుకు రోహిత్‌ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌ను జట్టు నుంచి దూరం కావడం భారత్‌ను షాక్‌కు గురి చేసింది. 


సఫారీ గడ్డపై టీ 20సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని ఇప్పుడు టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే గాయాలు భారత జట్టును వేధిస్తుండగా ఇప్పుడు మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. షమీ జట్టుకు దూరమైన కొన్ని రోజులకే టీం ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ తప్పుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.. ఇషాన్ కిషన్ స్థానంలో కె. ఎస్. భరత్ ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ... దక్షిణాఫ్రికా నుంచి ఆకస్మికంగా తిరిగి భారత్‌కు వచ్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ కారణంగా  కోహ్లీ సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 26 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు నాటికి కోహ్లీ జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది.  


గాయంతో రుతారాజ్‌ అవుట్‌!

మరోవైపు దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్‌ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్‌ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్‌ నుంచి వైదొలిగాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భార‌త ఆట‌గాళ్లు ద‌క్షిణాఫ్రికా వెళ్లారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మతో పాటు సీనియ‌ర్ ఆట‌గాళ్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్రన్ అశ్విన్‌, న‌వ‌దీప్ సైనీ, హ‌ర్షిత్ రాణా ద‌క్షిణాఫ్రికాలో ఉన్నారు. 

 

ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో భార‌త్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొంద‌డం భార‌త్‌కు చాలా కీలకం. అయితే.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై భార‌త జ‌ట్టు ఇంత వ‌ర‌కు టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. ఈ సారి అయిన అంద‌ని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ష‌మీ సిరీస్‌కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జ‌ర‌గ‌నుంది.