ఆసియా కప్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా ఆడిన టీమిండియా.. కీలకమైన సూపర్- 4 మ్యాచులు రెండింటిలో ఓడిపోయి దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్, శ్రీలంకలపై 170కిపైగా పరుగులు చేసినా వాటిని కాపాడుకోలేక ఓటమి పాలయ్యింది. ఈ క్రమంలో జట్టు ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. 


నలుగురు పేసర్లేనా!


ఆసియా కప్ టోర్నీకి భారత సెలక్షన్ కమిటీ హార్దిక్ తో కలిపి నలుగురు పేసర్లనే ఎంపిక చేసింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో ముందే దూరం కాగా.. భువనేశ్వర్, అర్హదీప్ సింగ్, అవేష్ ఖాన్, హార్దిక్ పాండ్యను పేసర్లుగా ఎంపిక చేసింది. దీనిని రవిశాస్త్రి తప్పుబట్టాడు. సీనియర్ పేసర్ షమీని ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. సెలక్షన్ కమిటీ ఎంపిక బాలేదని.. కేవలం నలుగురు పేసర్లనే ఎంచుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అంతగా అనుకూలించవని.. అలాంటప్పుడు ఒక స్పిన్నర్ ను తగ్గించుకుని మరో ఫాస్ట్ బౌలర్ ను తీసుకుని ఉండాల్సిందని అన్నాడు. 


షమిని పక్కనపెట్టడం సరికాదు


శ్రీలంకతో మ్యాచ్‌లో మరో నాణ్యమైన పేసర్ లేకపోవడం టీమిండియాకు నష్టం కలిగించిందని రవిశాస్త్రి అన్నారు. ఆసియా కప్ కోసం భారత జట్టు ఎంపిక సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. సీనియర్ షమీని పక్కనపెట్టడం సమంజసం కాదని అన్నాడు. అవేష్ ఖాన్ జ్వరంతో బాధపడుతుండటంతో శ్రీలంకతో మ్యాచుకు అందుబాటులో లేడు. దీంతో ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతోనే భారత్ ఆడినట్లు ఉందని రవిశాస్త్రి అన్నాడు. మ్యాచ్‌లు గెలవాలంటే మంచి సన్నద్ధత అవసరమని తెలిపాడు. బౌలింగ్ దళం సరిగ్గా లేకపోవడం వల్ల 170కి పైగా స్కోర్లను కూడా కాపాడుకోలేకపోయిందని అన్నాడు. 


మంగళవారం కీలకమైన సూపర్- 4 మ్యాచ్ లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.