భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చావోరేవో తేల్చుకునే మ్యాచ్‌కు సిద్ధమైంది. సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలుపు పాక్‌కు, కివీస్‌కు అత్యంత కీలకం. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సోషల్‌ మీడియాలో పాకిస్థాన్‌ సారధి బాబర్‌ ఆజంకు సంబంధించిన వార్త ట్రెండ్‌ అవుతోంది. ఈ వార్త చూసి పాకిస్థాన్ ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. ఇప్పటికే వరుసగా మ్యాచ్‌లు ఓడిపోయి పాక్‌ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్‌.. ఇప్పడు కొత్త వివాదంలో ఇరుక్కోవడం కలకలం రేపుతోంది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బాబర్‌ను తొలగించి వేరే ప్లేయర్‌ను కెప్టెన్ చేయాలంటూ పలువురు మాజీ క్రికెటర్ల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి తన చేష్టల ద్వారా పాక్ కెప్టెన్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.



 ఈ ఏడాది చివరలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్‌ కోసం భారత్‌లో ఉన్న బాబర్‌.. తన పెళ్లి కోసం షాపింగ్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు తన పెళ్లి కోసం ఓ ఖరీదైన షేర్వాణీ కొన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన షేర్వాణీని బాబర్ కొనుగోలు చేశాడని సోషల్‌ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. ఏడు లక్షలు పెట్టి బాబర్ ఆజమ్ సంప్రదాయ షేర్వాణీ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రపంచకప్ కోసం భారత్ వచ్చిన బాబర్ ఆజమ్.. పెళ్లి కోసం పెద్దఎత్తున షాపింగ్ చేసినట్లు తెలిసింది. ఆభరణాలు కూడా కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.



       బాబర్‌ ఆజం పెళ్లి షాపింగ్‌పై పాకిస్థాన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. బాబర్‌ షాపింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాదీనిపై పాక్‌ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ ముందుడగా పెళ్లి షాపింగ్ ఏంటంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. టోర్నీ కీలకమైన సమయంలో ఉన్నప్పుడు.. మ్యాచ్‌లపై దృష్టిపెట్టకుండా ఇవేం పనులంటూ మరికొందరు మండిపడుతున్నారు. కీలకమైన క్రికెట్ మ్యాచ్‌ కంటే పెళ్లి మీద శ్రద్ధ ఎక్కువైతే ఎలాగంటూ మరికొంత నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నా రు. షాపింగ్‌ మీద కాదు ఆటమీద దృష్టి అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గానూ బాబర్ విఫలమవుతున్నాడు. ఏడు మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ 77 స్ట్రెక్ రేట్‌తో 30 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. 



  ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్‌.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే డూ ఆర్‌ డై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పాకిస్తాన్‌ ప్రస్తుతం 6 పాయింట్లతో పాయింట్ల పట్టిలో ఆరో స్ధానంలో ఉంది. సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ బాబర్‌ సేన విజయం సాధించాలి. ఈ క్రమంలో నేడు బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో పాకిస్తాన్‌ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఒక వేళ పాకిస్థాన్ ఓడిపోతే మాత్రం.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇలాంటి కీలక మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజమ్ తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.