ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. ధర్మశాల పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో టాస్‌ గెలవడం టీమిండియాకు కలిసిరానుంది. అనుకున్నట్లే గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమైన హార్దిక్‌ పాండ్యా స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్ జట్టులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో మహ్మద్‌ షమీ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇవి రెండు తప్ప టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. న్యూజిలాండ్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. ఇదే వేదికపై జరిగిన గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నెదర్సాండ్స్‌ గెలిచింది. 

 

ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు మధ్య కీలక సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఈ విశ్వ సమరంలో అసలు సిసలు పోరుకు సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో ఇంతవరకు ఓటమి ఎరుగని రెండు జట్లు మైదానంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌తో రోహిత్‌ సేన ఢీ కొనబోతోంది. కివీస్‌తోనే భారత జట్టుకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఐసీసీ టోర్నమెంట్‌లలో కివీస్‌పై మంచి రికార్డులేని టీమిండియా.. ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తోంది. 2003 ప్రపంచకప్‌లో సౌరభ్‌ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు.. కివీస్‌ను ఓడించింది. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు. గాయం కారణంగా భారత జట్టుకు హార్దిక పాండ్యా దూరంకాగా... న్యూజిలాండ్‌కు కెప్టెన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు. ఆల్‌రౌండర్‌ లేకుండా రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో ఒక్క జట్టు కూడా టీమిండియాకు కనీసం పోటీ ఇవ్వలేదు. కానీ కివీస్‌తో మ్యాచ్‌ మాత్రం అంత తేలిగ్గా ఉండదని మాజీలు అంచనా వేస్తున్నారు.
  

 

హార్దిక్‌ స్థానంలో ఎవరు?

పాండ్యా గాయం కారణంగా టీమిండియా సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని మాజీలు హెచ్చరిస్తున్నారు. పాండ్యా గాయం కారణంగా దూరమైతే ఈ ప్రపంచకప్‌లో తొలిసారి పేసర్ మహ్మద్ షమీ బరిలోకి దిగడం ఖాయం. ధర్మశాల పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలతో షమీ తుది జట్టులోకి రావడం తథ్యం. ఒకవేళ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయాలని చూస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వస్తాడు. అయితే మ్యాచ్‌ రోజే తుది నిర్ణయం తీసుకుంటామని రోహిత్‌ వెల్లడించాడు. బంతితో బ్యాట్‌తో కూడా రాణించే రవిచంద్రన్ అశ్విన్‌ కూడా జట్టులోకి రావచ్చు. 

 

పటిష్టంగా టీమిండియా

వరుస విజయాలతో టీమ్‌ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. టాపార్డర్‌లో రోహిత్‌, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. అఫ్గాన్‌పై సెంచరీ చేసిన రోహిత్‌... దాయాది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌పై కూడా మంచి ఇన్నింగ్సులు ఆడాడు. కోహ్లీ కూడా మంచి ఫామ్‌ అందిబుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ కూడా బాదాడు. కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విలువైన స్కోర్ అందిస్తున్నాడు. రానున్న మ్యాచుల్లో వీరు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు.  గిల్, శ్రేయస్,జడేజా కూడా రాణిస్తే కివీస్‌ బౌలర్లకు తిప్పలు తప్పవు. ఎలాగూ ఉండనే ఉన్నాడు. బౌలింగ్‌లో బుమ్రా,కుల్‌దీప్‌, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తున్నారు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ సిరాజ్ జట్టు విజయాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా సమష్టిగా రాణిస్తే ఇక కివీస్‌ను చిత్తు చేయడం కష్టతరమైన పనేమి కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

 

కివీస్‌ కూడా బలంగానే

  అయితే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాలే. ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్‌ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీదుంది. విల్ యంగ్, డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, లాథమ్, ఫిలిప్స్‌లతో ఆ జట్టు బ్యాటింగ్‌ బలంగా ఉంది. బౌలింగ్‌లో మ్యాట్‌ హెన్రీ, శాంట్నర్‌, ఫెర్గూసన్‌ అదరగొడుతున్నారు. ప్రస్తుతం శాంట్నర్ 11 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 

 

టీమిండియా ఫైనల్‌ 11: 

రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ , రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ,

 

న్యూజిలాండ్ ఫైనల్‌ 11: 

డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్‍( కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్,  ట్రెంట్ బౌల్ట్