భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ ప్రదర్శన క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా, సిరాజ్‌లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోయాడు. బంతితో నిప్పులు చెరిగాడు. బాల్‌ అందుకుంటే వికెట్‌ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. 

 

అయితే వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌ సందర్భంగా షమీ నమాజ్‌ చేసేందుకు యత్నించాడన్న  వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.  ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ అయిదు వికెట్లతో చెలరేగాడు. ఐదో వికెట్‌ పడకొట్టగానే షమీ మైదానంలో మోకాలిపై కూర్చొని రెండు చేతులతో నేలను తాకాడు. అయితే ఈ సెలబ్రేషన్స్‌ను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడని ఆరోపించారు. తాజాగా ఈ వార్తపై ఈ స్టార్‌ టీమిండియా ప్లేయర్‌ స్పందించాడు. 

 

తాను మైదానంలో నమాజ్ చేసేందుకు ప్రయత్నించానన్న వార్తలపై షమీ గట్టిగా స్పందించాడు. తాను నమాజ్‌ చేయాలనుకుంటే తనను అడ్డుకునేది ఎవరని ప్రశ్నించాడు. తాను ఒక భారతీయ ముస్లింనని, ఆ విషయాన్ని గర్వంగా చెప్తానని అన్నాడు. నమాజ్‌ చేయడానికి ఎవరో అనుమతి తీసుకోవాలంటే తాను ఈ దేశంలో ఎందుకు ఉంటానని షమీ ప్రశ్నించాడు. తాను ఇంతకు ముందు కూడా చాలా సార్లు 5 వికెట్లు సాధించానని... అప్పుడెప్పుడైనా నమాజ్‌ చేశానా అని ప్రశ్నించాడు. తాను గర్వించదగిన భారత ముస్లింనని, నమాజ్ చేయాలనుకుంటే అడ్డుకునేవారే లేరన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో చాలా కష్టపడి బౌలింగ్‌ చేశానని... దీంతో కాస్త అలసటకు గురై మోకాళ్లపై కూర్చున్నాని షమీ  స్పష్టం చేశాడు. షమీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్దమవుతున్నాడు.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో షమీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో షమీ 7/57 గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనతతో షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు. న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో ఏడు వికెట్ల హాల్‌తో.. వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు అయిదు వికెట్లు సాధించిన బౌలర్‌గానూ షమీ మరో రికార్డ్‌ని నెలకొల్పాడు.

 

మరోవైపు భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ పేరును అర్జున అవార్డు కోసం బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన చేసిందని క్రీడా వర్గాలు తెలిపాయి. క్రీడా మంత్రిత్వ శాఖకు మొదటగా పంపిన జాబితాలో మహ్మద్ షమి పేరు లేదు. అలాగే, ‘‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’’ అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు. ఈ ఏడాది సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో నెంబర్ వన్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.