సఫారీ గడ్డపై మూడో టీ 20లో గెలిచి సిరీస్‌ను సమం చేసిన టీమిండియాకు.. టెస్ట్‌ సిరీస్‌కు ముందు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అలాగే కుటుంబ సమస్యల కారణంగా వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐకి దీపక్‌ చాహర్‌ తెలపడంతో అతడిని వన్డే జట్టు నుంచి తప్పించారు. దీపక్‌ చాహర్‌ తండ్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కారణంతో వన్డే సిరీస్‌కు దీపక్‌ చాహర్‌ అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో ఆకాష్ దీప్‌ను అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వన్డే జట్టు సారధ్య బాధ్యతలను కేఎల్‌ రాహుల్‌కు అప్పగించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చారు.


మరోవైపు భారత్‌ వేదికగా జరిగిన  వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌ నుంచి దూరమయ్యాడు. షమీకి BCCI వైద్య బృందం క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో అతడికి టెస్ట్‌ జట్టు నుంచి విశ్రాంచి ఇచ్చారు. చీల‌మండ‌ల గాయంతో బాధ‌ప‌డుతున్న ష‌మీ... ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని తెలుస్తోంది. అందుకే ద‌క్షిణాప్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు షమీ దూరం అయ్యాడు. రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భార‌త ఆట‌గాళ్లు ద‌క్షిణాఫ్రికా వెళ్లారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మతో పాటు సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్రన్ అశ్విన్‌, న‌వ‌దీప్ సైనీ, హ‌ర్షిత్ రాణా ద‌క్షిణాఫ్రికాలో ఉన్నారు. వీరితో షమీ వెళ్లలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో భార‌త్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొంద‌డం భార‌త్‌కు చాలా కీలకం.


అయితే.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై భార‌త జ‌ట్టు ఇంత వ‌ర‌కు టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. ఈ సారి అయిన అంద‌ని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ష‌మీ సిరీస్‌కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జ‌ర‌గ‌నుంది.
 మరోవైపు డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి వన్డే ముగిసిన తర్వాత, టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు శ్రేయాస్ అయ్యర్ టెస్టు జట్టులో చేరతాడు. రెండు, మూడు వన్డేలకు శ్రేయస్స్‌ అయ్యర్‌ అందుబాటులో ఉండడు. 


దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే జట్టు:  రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్‍‍(కెప్టెన్‌), సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్