దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కఠిన సవాళ్లను ఎదుర్కొని అద్భుత శతకం సాధించిన కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో టాప్‌ఆర్డర్‌ విఫలమైనా ఒంటరి పోరాటం చేసిన రాహుల్‌... భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్‌ శతకంతో చెలరేగి... చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సెంచూరియ‌న్  మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్‌గా రాహుల్‌ నిలిచాడు. 2021,22 ప‌ర్యట‌న‌లో ఇదే మైదానంలో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రాహుల్ 123 ప‌రుగులు చేశాడు. ఇప్పుడు మరో సెంచరీతో రికార్డు సృష్టించాడు. రాహుల్‌ ఆటతీరుపై దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. 

 

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌ సాధించిన శతకం భారత టెస్టు చరిత్రలో టాప్‌-10 సెంచరీల్లో ఒకటని సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. తాను 50 ఏళ్లుగా క్రికెట్‌ చూస్తున్నానని... రాహుల్‌ సాధించిన ఈ శతకం భారత టెస్టు చరిత్రలో టాప్‌-10లో ఒకటిగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పగలనని గవాస్కర్‌ కొనియాడాడు. ఇది చాలా భిన్నమైన పిచ్‌ అని గావస్కర్‌ అన్నాడు. బంతి ఎలా వస్తుందో తెలియని క్లిష్టమైన పిచ్‌పై రాహుల్‌ గొప్పగా ఆడాడడని, అలాంటి పిచ్‌పై ఆడాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్పాడు. 

 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే...

సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. డీన్‌ ఎల్గర్‌ అద్భుత పోరాటంతో ప్రొటీస్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసిన డీన్‌ ఎల్గర్‌ భారీ శతకం సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో  రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్‌ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. సఫారీ జట్టు ఇప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

అంతుకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులతో  రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మరో 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.  దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.  రెండో రోజు ఉదయం 70 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్..  137 బంతుల్లో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ అద్భుత శతకం చేసి భారత్ కు గౌరవమైన స్కోర్ అందించాడు. టెయిలెండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగూ జోడిస్తూ.. టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. 164 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయిన తర్వాత బుమ్రా, సిరాజ్ లతో కలిసి రాహుల్ స్కోరును 245 పరుగుల వరకూ తీసుకెళ్ళాడు. కోహ్లి 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ఆగిపోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన  రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్‌ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.