MS Dhoni Promotes Childhood Friends Sports Shop: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL 2024)లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌(Cricket) సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. 2023 ఐపీఎల్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు గెలుచుకుంది. ఇప్పటికే అయిదుసార్లు కప్పును గెలుచుకున్న చెన్నై మరోసారి కప్పును ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. చెన్నై సారధి ఎం.ఎస్. ధోనీ( MS Dhoni) మరోసారి జట్టును విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. అద్భుతమైన కెప్టెన్సీతో ఇప్పటికే అయిదుసార్లు జట్టుకు కప్పు అందించిన ధోనీ ఆరోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో మరోసారి తనసత్తాను చూపేందుకు తలైవా సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 టోర్నీకి సంబంధించి ధోనీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. రాంచీలో ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది.



కొత్త లోగో బ్యాట్‌తో ధోనీ 
తాజాగా ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. అది ఏ పెద్ద కంపెనీ లోగోనో కాదు. ఆ బ్యాటుపై ఉన్న స్టిక్కర్ ఏ కంపెనీది కాదు. ఆ స్టిక్కర్ మీద అత‌డి స్నేహితుడి షాపు పేరు రాసి ఉంది. బాల్యమిత్రుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో ధోనీ తన ఫ్రెండ్‌ షాప్ పేరుతో ఉన్న‌ స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మ‌హీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్' అనే క్రీడా పరికరాల దుకాణం ఉంది. ఇందులో క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇత‌ర ఆట సామ‌గ్రి ల‌భిస్తాయి. దాంతో, త‌న మిత్రుడి దుకాణానికి మ‌రింత పాపులారిటీ తేవ‌డం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారాయి. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. త‌న కెరీర్‌లో చాలా కంపెనీల లోగో ఉన్న బ్యాట్‌లు ఉప‌యోగించాడు.  అత‌డు స్నేహితుల దుకాణం పేరున్న బ్యాటుతో క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి. దాంతో, ప్రైమ్ స్పోర్ట్స్ బ్యాటుతో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన‌వాళ్లంతా.. అందుకే ధోనీ ప్రత్యేకం అంటూ కామెంట్లు పెడుతున్నారు.


మహీ భాయ్‌ ప్రత్యేక పూజలు 
టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్‌ ధోని(MS Dhoni)... జార్ఖండ్‌(Jarkhand) రాంచీ(Ranchi)లోని పవిత్ర దేవరీ ఆలయాన్ని( Dewri Temple) సందర్శించాడు. అభిమానుల మధ్య క్యూ లైన్‌లో నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నాడు. దేవరీ ఆలయంలోని దుర్గాదేవికి మహీ ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అభిమానులు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెన్నై కెప్టెన్ దేవరీ మా ఆలయంను సందర్శించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.దేవరీ ఆలయంలో ధోనీ ప్రత్యేక పూజలు చేయడం ఇదే తొలిసారి కాదు. కీలక టోర్నీలు, ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మహీ ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి దర్శనం చేసుకుంటాడు. భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ధోనీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ టోర్నీలు, ఐపీఎల్‌కు ముందు ఈ ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు.