Sanju Samson: గడిచిన ఏడాదిన్నర రెండేండ్లుగా భారత క్రికెట్ లో తాను ఆడినా ఆడకున్నా  చర్చలోకి వస్తున్న  క్రికెటర్   సంజూ శాంసన్. టాలెంట్ టన్నుల కొద్దీ ఉన్నా అదృష్టం అవిసెగింజంత కూడా లేని ఈ కేరళ  వికెట్ కీపర్ బ్యాటర్  జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు.  కారణాలేవైనా 30 ఏండ్లకు దగ్గర్లో ఉన్నా ఇప్పటికీ అతడికి  టీమిండియాలో పర్మనెంట్ ప్లేస్ లేదు.   వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే  సౌతాఫ్రికా  మాజీ ఆటగాడు, అభిమానులంతా ‘మిస్టర్ 360’ అని పిలుచుకునే ఏబీ డివలియర్స్ మాత్రం శాంసన్ ఏదో ఒకరోజు భారత జట్టుకు సారథి అవుతాడని  చెబుతుండటం విశేషం. 


కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలవే.. 


2021 నుంచి ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు సారథిగా ఉన్న  సంజూ.. గత సీజన్‌లో  తన టీమ్‌ను ఫైనల్స్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.  ఈ సీజన్ లో కూడా  టైటిల్ ఫేవరెట్లలో  రాజస్తాన్ రాయల్స్ ఒకటిగా ఉంది.  తాజాగా ఇదే విషయమై  డివిలియర్స్ స్పందిస్తూ... ‘సంజూ చాలా గొప్ప ఆటగాడు.  ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ అతడి కెప్టెన్సీ ఎలా ఉంటుంది..?  అంటే నాకు మొదట గుర్తొచ్చేది సంజూ ప్రశాంతత. ఫీల్డ్ లో  శాంసన్  చాలా రిలాక్స్డ్‌గా  ఉంటాడు.  కెప్టెన్‌గా ఉండి ఏదో వ్యూహం రచిస్తున్నట్టుగా ఎప్పుడూ కనిపించడు. నేనైతే  సంజూను అలా ఎప్పుడూ చూడలేదు. సారథికి ఉండాల్సిన మంచి లక్షణాల్లో ఇది కీలకం.   వ్యూహాత్మకంగా  శాంసన్  వేరే లెవల్‌లో ఉన్నాడు. రాబోయే రోజుల్లో అతడు మరింత రాటుదేలుతాడు. జోస్ బట్లర్ వంటి  అనుభవజ్ఞుడితో  గడుపుతుండటం శాంసన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. బట్లర్ రాజస్తాన్ కు విలువైన ఆస్తి..’అని చెప్పాడు. 


టీమిండియాకు సారథి  అవుతాడు.. 


‘కెప్టెన్ అవడానికి  అన్ని అర్హతలను అతడు సాధించాడని నేను భావిస్తున్నా. ఎవరికి తెలుసు..? రాబోయే రెండు మూడేండ్లలో  ఏదో ఒకరోజు  శాంసన్ భారత జట్టుకు  కెప్టెన్ గా ఉంటాడు. అతడి క్రికెట్ ను మంచి ప్రపంచంగా ఉండనీయండి..’అని  డివిలియర్స్  జియో సినిమాతో జరిగిన చర్చలో భాగంగా  తెలిపాడు.  


 






అసాధ్యం..?


డివిలియర్స్ అభిప్రాయంఎలా ఉన్నా  శాంసన్ భారత సారథి కావాలంటే మాటల్లో చెప్పినంత ఈజీ అయితే కాదు.  ప్రస్తుతం రోహిత్ శర్మను   వన్డే, టెస్టులకు పరిమితం చేసి  హార్ధిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు అప్పజెప్పేందుకు బీసీసీఐ  సిద్ధమైంది.  ఈ మేరకు సంకేతాలు కూడా గట్టిగానే ఇచ్చింది.  గతేడాది ఆసీస్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి రోహిత్  ను పక్కనబెట్టి  హార్ధిక్ కే  పగ్గాలు అప్పజెప్పింది. ఒక్క రోహిత్  మాత్రమే కాదు.. టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, అశ్విన్, భువనేశ్వర్ ల టీ20 కెరీర్ దాదాపుగా ముగిసినట్టే..! అధికారికంగా ప్రకటన రాకపోయినా   భారత భావి సారథి   హార్ధికేనని క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. మరి డివిలియర్స్  ఆశలు నెరవేరేదెప్పుడో..!