Smriti Mandhana And Kaur Shines India Cleansweeps South Africa: మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా (INDW vs SAW )ను వైట్‌వాష్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్( Harmanpreet Kaur) కెప్టెన్సీలో భారత్ సొంతగడ్డపై జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఇచ్చిన 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  దూకుడుగా ఆడిన స్మృతి మంధాన (Smriti Mandhana) హ్యాట్రిక్ శతకాన్ని చేజార్చుకున్నా.. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ , జెమీమా రోడ్రిగ్స్ జట్టును విజయ తీరానికి చేర్చారు. 


హ్యాట్రిక్ సెంచరీ మిస్ చేసుకున్న స్మృతి మంధాన 
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ కు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 40.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన బ్యాటింగ్ తో మెరుపులు కురిపించింది. కానీ  10 పరుగుల తేడాతో ఆమె వరుసగా  హ్యాట్రిక్ సెంచరీని కోల్పోయింది. 83 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి  ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. 






 


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా.. 


గత కొంత కాలంగా  అద‌ర‌గొడుతున్న భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మూడో వ‌న్డేలోనూ ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఇప్ప‌టికే 2-0తో సిరీస్ ను తన ఖాతాలో వేసుకున్న   టీమిండియా నామ‌మాత్ర‌మైన ఆఖ‌రి మ్యాచ్‌లోనూ  జోరు కొనసాగించింది.  ద‌క్షిణాఫ్రికా ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుభారంభం చేసింది. మంధాన, షెఫాలీ వర్మ కలిసి  61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. .డాషింగ్ ఓపెన‌ర్ షఫాలీ వ‌ర్మ‌ 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ కాగా   ప్రియా పునియా తో కలిసి మంధాన పరుగులు  కొనసాగించింది.  హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్కె ప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. కానీ అర్ధశతకం పూర్తి చేయలేకపోయింది.   48 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసింది . జెమిమా రోడ్రిగ్స్ 19, రిచా ఘోష్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. రిచా  చివరిలో సిక్స్ కొట్టి   భారత్‌ను విజయ తీరానికి చేర్చింది. 


దక్షిణాఫ్రికా  ఆట :


టాస్ గెలిచిన స‌ఫారీలు  ఆరంభంలో అదరగొట్టారు. కెప్టెన్ లారా వోల్వార్డ్ దూకుడుగా  ఆడింది. 57 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసింది. త‌జ్మిన్ బ్రిట్స్‌ తో కలిసి మొదటి వికెట్‌కు 119 బంతుల్లో 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా భారీ స్కోరుకు పునాది వేసింది,  18వ ఓవర్లో దక్షిణాఫ్రికా వంద పరుగులు దాటింది. అయితే  20వ ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి ఈ జంట‌ను అరుంధ‌తీ రెడ్డి విడ‌దీసింది.   ఆ తరువాత నుంచి  విరివిగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో దక్షిణాఫ్రికా 120 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత్ తరఫున అరుంధతి, దీప్తి శర్మలు రెండేసి వికెట్లు తీయగా, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు. 


మూడవ సెంచరీ కోల్పోయినా మహిళల క్రికెట్‌లో మూడు వన్డేల సిరీస్‌లో అత్యధికంగా 343  పరుగులు  చేసిన క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది.