ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదున్న యువ భారత్‌ దక్షిణాఫ్రికాతో తొలి టీ 20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఫ్రీడమ్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి ఈ పర్యటనలో శుభారంభం చేయాలని  టీమిండియా భావిస్తోంది. జస్ప్రిత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రోహిత్‌ శర్మ, కోహ్లీ సహా సీనియర్‌ ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో అనుభవం అంతగా లేని యువ జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై 4-1తో విజయం సాధించినా  సఫారీ గడ్డపై కఠిన సవాలు ఎదురుకానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు స్వదేశంలో అద్భుతమైన బ్యాటింగ్ ట్రాక్‌లపై ఆస్ట్రేలియాను 4-1తో ఓడించింది. కానీ దక్షిణాఫ్రికాలో భారత బ్యాటర్లకు పేస్‌ ట్రాక్‌లతో సవాల్‌ ఎదురుకానుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని జట్టు ప్రొటీస్‌ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అనుభవజ్ఞులు లేని ఆస్ట్రేలియా బౌలింగ్‌ దళంపై స్వదేశంలో టీమిండియా బాగానే రాణించింది. అయితే దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను దక్షిణాఫ్రికాలో ఎదుర్కోవడం అంత తేలిక కాదు.

 

శుభ్‌మన్‌ గిల్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌వర్మలతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియాపై  52 బంతుల్లోనే సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. జైస్వాల్, గిల్, గైక్వాడ్‌ వరుసగా బ్యాటింగ్‌కు రానున్నారు. నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. అయితే ఇషాన్‌ కిషన్‌, జితేశ్‌ వర్మలో ఎవరికి తుది జట్టులో స్థానం దక్కుతుందో చూడాలి. తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా మంచి టచ్‌లో ఉండడం టీమిండియాకు అదనపు బలంగా మారింది. శ్రేయస్స్‌ అయ్యర్‌ను జట్టులోకి తీసుకుంటే... రింకూ సింగ్‌కు తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చు. అయితే మంచి ఫినిషర్‌గా మారుతున్న రింకూకు జట్టులోకి తీసుకోకపోయేంత సాహసం జట్టు మేనేజ్‌ మెంట్‌ చేయకపోవచ్చు.

 

ఒకవేళ ఇషాన్‌ కిషన్‌ను జట్టులోకి తీసుకోకపోతే జితేష్‌ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.  హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ ఐడెన్ మాక్రమ్‌లతో సౌతాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్ చాలా బలంగా ఉంది. హార్డ్ హిట్టర్‌ ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 

టీమిండియా పేస్‌ విభాగమే... కాస్త ఆందోళనపరుస్తోంది. సిరాజ్‌ చేరికతో పేస్‌ బౌలింగ్‌ కాస్త బలోపేతమైంది. టీ 20ల్లో నెంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌ స్పిన్.. భారత్‌కు కలిసిరానుంది. పేస్‌ పిచ్‌లపై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం..... అంత తేలిక కాదు. కగిసో రబాడ.. ఎంగిడి గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైనా..జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఫెహ్లుక్వాయో పేస్‌తో భారత బ్యాటర్లకు తిప్పలు తప్పవు. దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్  పేస్ దళాన్ని మోయనున్నారు. 

 

టీమిండియా  జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. 

 

దక్షిణాఫ్రికా  జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.