మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ రెండో మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ అన్నాబెల్ స‌థ‌ర్‌లాండ్‌ను భారీ ధరకు ఢిల్లీ దక్కించుకుంది. 40 లక్షల క‌నీస ధ‌ర‌తో రిజిస్టర్‌ అయిన ఆల్‌రౌండ‌ర్ అన్నాబెల్ స‌థ‌ర్‌లాండ్‌ను దక్కించుకునేందుకు ముంబై ఇండియ‌న్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ చివరి వరకూ గట్టిగా పోరాడాయి. అయితే చివరకు చివ‌ర‌కు ఢిల్లీ రూ. 2 కోట్లతో అన్నాబెల్‌ను దక్కించుకుంది. అన్నాబెల్‌కు టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఆమె 14 మ్యాచుల్లో 288 ర‌న్స్ సాధించింది. బౌలింగ్‌లోనూ స‌త్తా చాటుతూ 23 వికెట్లు ప‌డ‌గొట్టింది. ఇక రూ.30 ల‌క్షల క‌నీస ధ‌రతో రిజిస్టర్‌ అయిన లిచ్‌ఫీల్డ్ కోసం యూపీ వారియ‌ర్స్, గుజ‌రాత్ జెయింట్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు  యువ బ్యాటర్‌ ఫోబె లిచ్‌ఫీల్డ్‌ను గుజ‌రాత్ రూ. 1 కోటికి దక్కించుకుంది. తొలిసారి డబ్ల్యూపీఎల్‌ వేలంలోకి వచ్చిన ఆమె ఊహించని ధరకు అమ్ముడుపోయింది. రూ. 30 లక్షల కేటగిరీలో వచ్చిన ఆమె కోసం గుజరాత్‌ కోటీ రూపాయలు ఖర్చు చేసింది.


ఆస్ట్రేలియాకు చెందిన ఫోబె లిచ్‌ఫీల్డ్‌ 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎడమ చేతి వాటం బ్యాటర్‌ అయిన లిచ్‌ఫీల్డ్‌.. 2022లో భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ ఆసీస్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన లిచ్‌ఫీల్డ్‌.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌తో పాటు ఉమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్), దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ఉమెన్స్‌ బిగ్‌బాష్‌, ఉమెన్స్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌లలో అదరగొడుతోంది. అదే ఆమెకు ఊహించని ధర దక్కేందుకు కారణమైంది.


మహిళా ప్రీమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌ వేలానికి సంబంధించి జాబితాను నిర్వాహకులు ఇప్పటికే విడుదల చేశారు. మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. మొత్తం 165 మందిలో 104 మంది భారత(Indian) క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు. నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ఐదు ఫ్రాంచైజీ జట్లు వేలంలో పాల్గొంటుండగా... 30 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఐదు టీమ్‌లు మొత్తం 29 మంది క్రికెటర్లను రిలీజ్‌ చేశాయి. ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ 30 మంది ఆటగాళ్లలో 9 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 


గతేడాది జరిగిన WPL వేలంలో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti mandhana) కళ్లు చెదిరే ధరకు ఎంపికైంది. ఆమెను రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టులోకి తీసుకుంది. WPL తొలి సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన తొలి మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు సృష్టించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆష్లీ గార్డనర్‌ రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్, స్కివర్‌ను రూ. 3.20 కోట్లకు ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేశాయి. ఇక భారత ప్లేయర్లు దీప్తి శర్మ (రూ. 2.60 కోట్లు - యూపీ వారియర్స్), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు - దిల్లీ క్యాపిటల్స్) అత్యధిక ధర పలికిన జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై ఇండియన్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి టైటిల్‌ కైవసం చేసుకుంది.