India vs Bangladesh, Match highlights : టీ 20 ప్రపంచకప్‌(World Cup)లో టీమిండియా(Team India) జోరు కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ రాణించిన టీమిండియా.. బంగ్లా(Bangladesh) ను చిత్తు చేసి సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.  మొదట బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేయగా..ఆ తర్వాత బౌలర్లు బంగ్లా బ్యాటర్లను చుట్టేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు టపార్డర్‌ జూలు విదల్చడంతో స్లో పిచ్‌పై భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌  మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోరు చేసింది. స్లో పిచ్‌పై ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం బంగ్లా బ్యాటర్ల వల్ల కాలేదు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్‌ విభాగం బంగ్లా బ్యాటర్లకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. దీంతో బంగ్లా కేవలం 146 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. 


భారత బ్యాటర్ల ధనాధన్‌...

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohit Sharma)- విరాట్‌ కోహ్లీ(Virat Kohli) శుభారంభం అందించారు. ఈ టోర్నీలో ఆత్మ విశ్వాసంతో కనపడ్డ విరాట్‌ కోహ్లీ... బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కోహ్లీ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్‌తో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. 28 బంతుల్లో ఒక  ఫోర్‌, మూడు సిక్సులతో 37 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకున్న కోహ్లీని హసీన్‌ షకీబ్‌ అవుట్‌ చేశాడు. తొలి బంతికే సిక్స్‌ కొట్టిన సూర్య ఆ తర్వాతి బంతికే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 77 పరుగులకు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. తంజీద్‌ హసన్‌ షకీబ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.

రిషభ్ పంత్ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో పంత్‌ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న దూబే ఆ తర్వాత ధాటిగా ఆడాడు. 24 బంతుల్లో మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసి దూబే అవుటయ్యాడు. 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో హార్దిక్‌ పాండ్యా  అర్ధ శతకం చేశాడు. చివరి ఓవర్‌ చివరి బంతికి ఫోర్‌ కొట్టి పాండ్యా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా  నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి  196 పరుగులు చేసింది. 

 

తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. బంగ్లా ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. 10 బంతుల్లో 13 పరుగులు చేసిన లిట్టన్‌దాస్‌ను అవుట్‌ చేసి హార్దిక్‌ పాండ్యా టీమిండియాకు తొలి వికెట్‌ అందించాడు. అనంతరం హసన్‌-శాంటో కూడా పర్వాలేదనిపించారు. హసన్ 29, శాంటో 40 పరుగులు చేయడంతో బంగ్లా లక్ష్యం దిశగా పయనించినట్లే కనిపించింది. కానీ కుల్‌దీప్‌ యాదవ్ బంగ్లాను కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన కుల్‌దీప్‌ 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. ఆ తర్వాత పని బుమ్రా పూర్తి చేశాడు. బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్‌ కూడా రెండు వికెట్లు తీశాడు. దీంతో బంగ్లా ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.