India vs Australia World Cup Final 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర మాములుగా సాగలేదు. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో రోహిత్‌ సమర్థ సారథ్యంలో టీమిండియా దుమ్మురేపింది. ఒక్క పరాజయం లేకుండా అప్రతిహాత విజయాలతో తుదిపోరుకు సిద్ధమైంది. లీగ్‌ దశ నుంచి న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ వరకు భారత్‌ విజయాలన్నీ ఏకపక్షమే. సెమీఫైనల్లో కివీస్‌ కాస్త కలవరపెట్టినా 70కుపైగా పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆస్ట్రేలియాతో తుది పోరుకు సిద్ధమైంది. లీగ్‌ దశలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లో రోహిత్‌ సేన సాధికార విజయాలు సాధించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్ దూకుడును ఒకసారి మననం చేసుకుందాం..

 

మొదటి మ్యాచ్‌ ఇలా...

ఈ ప్రపంచకప్‌లో టైటిల్‌ కోసం పోరాడాల్సిన ఆస్ట్రేలియాను ఆరంభ మ్యాచ్‌లోనే రోహిత్‌ సేన చిత్తు చేసింది. వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 1999 తర్వాత ఆస్ట్రేలియాను ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లోనే భారత్‌ ఓడించింది. కేఎల్ రాహుల్ (97 నాటౌట్) విరాట్ కోహ్లీ (85‌) పరుగులతో భారత్‌కు విజయం అందించారు. 

 

రెండో మ్యాచ్‌ ఏకపక్షమే..

రెండో మ్యాచ్‌లో  ఈ ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టించిన అఫ్గానిస్థాన్‌పైనా భారత్ సునాయస విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (131: 84 బంతుల్లో, 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. 

 

హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో పాక్‌ చిత్తు

ప్రపంచకప్‌లో దాయాదుల పోరులో టీమిండియా మరోసారి పాక్‌ను చిత్తు చేసింది. గత 7 వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాక్‌పై గెలిచిన భారత్..  అదే ఆనవాయితీ కొనసాగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది.  ఈ లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా ఛేదించి మూడో విజయం నమోదు చేసింది.

 

నాలుగో మ్యాచ్‌లో బంగ్లాపై

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన మరో ఏకపక్ష విజయం సాధించింది. టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. అ‌ద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. టీమిండియా 41 ఓవరల్లో కేవలం మూడు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది.

 

కివీస్‌కు చావు దెబ్బ

న్యూజిలాండ్‌పై విజయంతో ఈ మహా సంగ్రామంలో టీమిండియా వరుసగా అయిదో విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్‌ కోహ్లీ 104 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సులతో 95 పరుగులు చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాకే

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను రోహిత్ సేన మట్టికరిపించింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత్‌ బౌలర్లు చుట్టేశారు. కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే బ్రిటీష్‌ జట్టు కుప్పకూలింది. 100 పరుగుల భారీ తేడాతో రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది.

 

లంకను సునాయసంగా దాటేసి..

2023 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ వరుసగా ఏడో మ్యాచ్‌లో విజయం సాధించింది.

 

దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి

ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. కింగ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు) 49వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

 

చివరి లీగ్‌లో నెదర్లాండ్స్‌పై

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి ఓటమి లేకుండా లీగ్‌ దశను ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ జట్టు శ్రేయస్స్‌ అయ్యర్‌, రాహుల్‌ శతకాలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

 

సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ప్రతీకారం...

సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌ భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కానీ షమీ మరోసారి జూలు విదిల్చడంతో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించాడు. ఇక అన్ని జట్లకు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన భారత్‌... ఆస్ట్రేలియాకు మరోసారి చుక్కలు చూపిస్తే భారత్‌ కొత్త చరిత్ర సృష్టించినట్లే...