విశాఖ(Visakha Patnam) వేదికగా ఆసీస్(Austrrelia) తో జరిగిన తొలి టీ20(t20) మ్యాచ్ లో టీమిండియా(Team India) అదరగొట్టింది. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. దీంతో 5 టీ20ల సీరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ శతకంతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ 52 పరుగులతో రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ కు తలో వికెట్ దక్కింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ను కెప్టెన్ సూర్యకుమార్ , ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ 80 పరుగులతో దూకుడుగా ఆడగా ఇషాన్ కిషన్ 58 పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లో 3 వికెట్లు పడి మ్యాచ్ ఉత్కంఠ నెలకొన్నప్పటికీ రింకూ సింగ్ భారత్ కు విజయాన్నందించాడు.



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. ఆరంభం నుంచే కంగారులు ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఓపెనర్లు స్టీవ్‌ స్మిత్‌, మ్యాథ్యూ షార్ట్‌ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. 4.4ఓవర్లలో 31 పరుగులు సాధించారు. ఈ దశలో రవి బిష్ణోయ్‌ వేసిన ఓ అద్భుత బంతికి మ్యాథ్యూ షార్ట్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 31 పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్‌ కోల్పోయారు. ఆ తర్వాత నుంచే టీమిండియాకు అసలు కష్టాలు మొదలయ్యాయి. స్టీవ్‌ స్మిత్‌తో జత  కలిసిన జోస్‌ ఇంగ్లిస్‌ భారత బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేవలం 11 ఓవర్లలోనే 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్టీవ్‌ స్మిత్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేసిన స్మిత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 110 పరుగులు చేసిన ఇంగ్లిస్‌ స్కోరు వేగాన్ని మరింత పెంచే క్రమంలో అవుటయ్యాడు. ఇంగ్లిస్‌  తన సెంచరీని కేవలం 47 బంతుల్లోనే చేశాడు. అనంతరం మార్కస్‌ స్టోయినీస్‌... ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ హీరో ట్రానిస్‌ హెడ్‌ ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా స్కోరు బోర్టు 200 పరుగుల మార్కు దాటింది. ట్రానిస్‌ హెడ్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేశాడు. వీరి విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.



 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి విజయం సాధించింది. యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. కానీ రుతురాజ్‌ ఒక్క పరుగు చేయకుండా పెవిలియన్‌ చేరడంతో టీమిండియా  11 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 21 పరుగులు చేసిన జైస్వాల్‌ కూడా వెనుదిరిగాడు. దీంతో 22 పరుగులకు భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ కీలక ఇనింగ్స్‌ ఆడారు. తనకు బాగా ఇష్టమైన ఫార్మాట్‌లో సూర్యా భీకరంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సులతో సూర్య 80 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఇషాన్‌ కిషన్‌ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 58 పరుగులు చేశాడు.



 వీరిద్దరి విధ్వంసంతో మ్యాచ్‌ టీమిండియా సునాయసంగా గెలిచేలా కనిపించింది. కానీ ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. కానీ రింకూసింగ్‌ భారత్‌కు విజయాన్నిఅందించాడు. 14 బంతుల్లో 4 ఫోర్లతో రింకూ 22 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి విజయానికి ఒక పరుగు అవసరంకాగా రింకూ సిక్స్‌ కొట్టాడు. ఆ బంతి నో బాల్‌ కూడా కావడంతో మరో  బంతి మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ 20 ఆదివారం జరగనుంది.