బెంగ‌ళూరు(Bangalore) వేదిక‌గా అఫ్గానిస్తాన్‌(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లీ(Virat Kohli) ఫీల్డింగ్‌ (Fealding)విన్యాసం సోషల్‌ మీడియాను దున్నేస్తోంది. ఇప్పటికే ఎన్నో అద్భుత క్యాచ్‌లను అందుకుని బెస్ట్‌ ఫీల్డర్‌గా నిరూపించుకున్న విరాట్‌.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మరోసారి కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. బౌండ‌రీ వ‌ద్ద కోహ్లీ అమాంతం గాల్లోకి ఎగిరి సిక్సర్ వెళ్లే బంతిని ఆపాడు. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌ను భార‌త బౌల‌ర్‌ వాషింగ్టన్ సుంద‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని అఫ్గాన్ బ్యాట‌ర్ క‌రీం జ‌న‌త్ భారీ షాట్ ఆడాడు. బంతి సిక్సర్ వెళ్లినట్లుగా కనిపించింది. అయితే.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద కోహ్లీ బంతి గమనాన్ని అంచనా వేసి అద్భుత జంప్‌తో బంతిని అడ్డుకున్నాడు. కోహ్లీ క్యాచ్‌గా అందుకోలేక‌పోయినా బంతి సిక్సు వెళ్లకుండా ఆపాడు. దీంతో ఆరు ప‌రుగులు వ‌స్తాయ‌నుకున్న అఫ్గాన్ చివ‌రికి సింగిల్‌తో స‌రిపెట్టుకుంది. దీంతో స్టేడియం మొత్తం కోహ్లీ నామ‌స్మర‌ణ‌తో మారుమోగిపోయింది. ఒక‌వేళ ఈ బాల్ గ‌నుక సిక్స్‌గా వెళ్లిఉంటే.. మ్యాచ్ టై అయ్యే అవ‌కాశం ఉండేది కాదు. అఫ్గాన్ విజ‌యం సాధించి ఉండేది. కోహ్లీ ఈ అద్భుత విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కోహ్లీ ఫీల్డింగ్‌పై ఐసీసీ, ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు.


ఐసీసీ ట్వీట్‌
కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ చూసి డ‌గౌట్‌లో ఉన్న కోచ్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ స‌హా అంద‌రూ షాక‌య్యారు. గాల్లోకి ఎగిరి బంతిని ఆపిన కోహ్లీ ఫొటోను ఐసీసీ(ICC) ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. కోహ్లీ ఫీల్డింగ్ జ‌స్ప్రీత్ బుమ్రా(Bumrah) బౌలింగ్ యాక్షన్‌కు మిర్రర్ ఇమేజ్‌లా ఉందంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీనిని కోహ్లీ అభిమానులు రీ ట్వీట్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మ‌హీంద్రా కూటా కోహ్లీ క్యాచ్‌పై కామెంట్‌ చేశారు. కోహ్లీ బంతిని ఆపే ఫోటోను పోస్ట్ చేస్తూ.. హలో ఐజాక్ న్యూటన్ ఈ గురుత్వాకర్షణ వ్యతిరేక విషయానికి సంబంధించి కొత్త నియమాల రూపకల్పనలో మీరు సాయం చేస్తారా అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు. 


నిరాశపరిచిన కింగ్‌...
అఫ్గాన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ నాలుగో బంతికి విరాట్‌ కోహ్లీ అవుట్యయాడు. ఎదుర్కొన్న తొలి బంతినే పుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా కోహ్లీ గోల్డెన్‌ డక్‌ నమోదు చేశాడు. కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలా ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటవ్వలేదు. కోహ్లి బ్యాటింగ్‌ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. విరాట్‌ కోహ్లి అవుట్‌ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో అఫ్గాన్‌ను మట్టికరిపించి... టీ20 చరిత్రలో అత్యధిక వైట్‌వాష్‌లు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎనిమిది సార్లు వైట్‌వాష్‌లు చేసిన జట్లుగా భారత్‌, పాకిస్థాన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. కానీ అఫ్గాన్‌తో మూడో టీ20లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన టీమిండియా.. 9 క్లీన్‌స్వీప్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది.