వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ చివర్లో తడబడ్డా భారీ స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (64: 40 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లు తీసుకున్నాడు. వెస్టిండీస్ విజయానికి 120 బంతుల్లో 189 పరుగులు చేయాలి.


టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ ఇషాన్ కిషన్ (11: 13 బంతుల్లో,  ఒక ఫోర్) ఐదో ఓవర్లో అవుటయ్యాడు. అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడాతో (38: 25 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి శ్రేయస్ అయ్యర్ (64: 40 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 76 పరుగులు జోడించారు.


అయితే శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా వరుస ఓవర్లలో అవుటయ్యారు. సంజు శామ్సన్ (15: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), దినేష్ కార్తీక్ (12: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా త్వరగా అవుట్ అయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా (28: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడినా, అవతలి ఎండ్‌లో సరైన సహకారం లభించకపోవడంతో భారత్ చివర్లో తడబడింది.


చివరి ఐదు ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు వికెట్లు దక్కించుకోగా... జేసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, హేడెన్ వాల్ష్ తలో వికెట్ పడగొట్టారు.