భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోరు చేసింది. షిమ్రన్ హెట్‌మేయర్ (61: 39 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాయ్ హోప్ (45: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా రాణించాడు. భారత్ విజయానికి 120 బంతుల్లో 179 పరుగులు కావాలి. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు.


టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కైల్ మేయర్స్ (17: 7 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ప్రారంభంలో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. కానీ రెండో ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్... కైల్ మేయర్స్‌ను అవుట్ చేసి భారత్‌కు మొదటి వికెట్ అందించాడు.అప్పటికి జట్టు స్కోరు 19 పరుగులు మాత్రమే. అయితే వన్ డౌన్ బ్యాటర్ షాయ్ హోప్ (45: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (18: 16 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేసి అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు రెండో వికెట్ అందించాడు. దీంతో పవర్‌ప్లేలోనే వెస్టిండీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.


ఫాంలో ఉన్న నికోలస్ పూరన్ (1: 3 బంతుల్లో), కెప్టెన్ రొవ్‌మన్ పావెల్‌లను (1: 3 బంతుల్లో) కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో అవుట్ చేసి వెస్టిండీస్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత షాయ్ హోప్, షిమ్రన్ హెట్‌మేయర్ (61: 39 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అర్థ సెంచరీకి కొంచెం ముంగిట బ్రాండన్ కింగ్ అవుట్ కావడంతో వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది.


రొమారియో షెపర్డ్ (9: 6 బంతుల్లో, ఒక సిక్సర్), జేసన్ హోల్డర్ (3: 4 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. అయితే షిమ్రన్ హెట్‌మేయర్, ఒడియన్ స్మిత్ వెస్టిండీస్‌ను భారీ స్కోరు వైపు నడిపించారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.


వెస్టిండీస్ తుది జట్టు
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్


భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్


Also Read: Citizenship Gave Up: భారత్‌ను వదిలేస్తున్న భారతీయులు - 12 ఏళ్లలో ఏకంగా 16.63 లక్షల మంది, కారణమేంటో తెలుసా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial