సిరీస్‌ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన సఫారీ జట్టు.. ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు... 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 42.3  ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రొటీస్‌ బ్యాటర్లలో టోనీడీ జార్జీ అద్భుత శతకంతో ప్రొటీస్‌కు విజయాన్ని అందించాడు. భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్‌, కెప్టెన్ రాహుల్‌ మెరిశారు. 


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అలా ఇన్నింగ్స్‌ ఆరంభించిందో లేదో టీమిండియాకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఫోర్‌ కొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. తర్వాతి బంతికే అవుటయ్యాడు. రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన రుతురాజ్‌ను... బర్గర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో నాలుగు పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటిన సాయి సుదర్శన్‌ మరోసారి మెరిశాడు. తిలక్‌ వర్మ... కెప్టెన్‌ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న సాయి సుదర్శన్‌... ఆ తర్వాత సాధికార బ్యాటింగ్‌ చేశాడు. 10 పరుగులు చేసిన తిలక్‌ను బర్గర్‌ వెనక్కి పంపాడు. ఆ తర్వాత రాహుల్‌-సాయి సుదర్శన్‌ టీమిండియా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 


ముఖ్యంగా సాయి సుదర్శన్‌ పూర్తి ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అర్ధ శతకాన్ని అందుకున్నాడు . ఆ తర్వాత కాసేపటికే సాయి సుదర్శన్‌ అవుటయ్యాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ను.... విలియమ్స్‌ అవుట్‌ చేశాడు. సాయి సుదర్శన్‌ అవుటయ్యాక... కెప్టెన్‌ కె.ఎల్‌, రాహుల్‌ రాణించాడు. 64 బంతుల్లో 7 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. రాహుల్‌ అవుటయ్యాక టీమిండియా వికెట్ల పతనం వేగంగా సాగింది. సంజు శాంసన్‌ 12 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. వన్డేలోకి అరంగేట్రం చేసిన రింకూసింగ్‌ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత్‌ 200 పరుగుల లోపే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. కానీ అర్ష్‌దీప్‌ సింగ్‌ పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో బాల్‌తో రాణించిన అర్ష్‌దీప్‌ 17 బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సుతో జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. కానీ 18 పరుగులు చేసిన అర్ష్‌దీప్‌ను హెండ్రిక్స్‌ అవుట్‌ చేయడంతో టీమిండియా 46.2 ఓవర్లకు 211 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్‌ అయింది.


అనంరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 42.3  ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రొటీస్‌ జట్టుకు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 130 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. హెండ్రిక్స్‌ 52 పరుగులు చేయగా.... టోనీ డీ జార్జీ అజేయ శతకం చేశాడు. జార్జీ 122 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డసెన్‌ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. జార్జీ మెరుపులతో సౌతాఫ్రికా సునాయస విజయం సాధించింది. బౌలింగ్‌లో రింకూసింగ్‌ ఓ వికెట్‌ తీయడం ప్రత్యేకంగా నిలిచింది.