IND vs NZ 1st T20: 


మళ్లీ కుర్రాళ్ల వంతు వచ్చేసింది! హార్దిక్‌ పాండ్య జట్టు మరో సమరానికి సిద్ధమైంది! ధోనీ డెన్‌ రాంఛీలో న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడుతోంది. మరోవైపు విలియమ్సన్‌, టిమ్‌ సౌథీ లేని బృందంతో శాంట్నర్‌ తంటాలు పడుతున్నాడు. పసలేని బౌలింగ్‌ దళంతో బలమైన టీమ్‌ఇండియాను ఢీకొడుతున్నాడు. మరి ఇద్దరిలో విజయం ఎవరిది? తుది జట్లలో ఎవరుంటారు?


బ్యాటింగ్ భీకరం!


ఇక టీ20లకు హార్దిక్‌ పాండ్యనే పర్మనెంట్‌ కెప్టెన్‌ అనుకోవచ్చు! రోహిత్‌ శర్మ పగ్గాలు వదులుకోలేదు. స్ల్పిట్‌ కెప్టెన్సీ గురించి తనకేమీ తెలియదని ద్రవిడ్‌ అంటున్నాడు. సెలక్టర్లను అడిగితే బెస్టని చెబుతున్నాడు. ఇలాంటి గందరగోళం నడుమే హార్దిక్‌ పాండ్య మూడో టీ20 సిరీసులో టీమ్‌ఇండియాను నడిపిస్తున్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ లేకపోవడంతో శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేయడం ఖాయమే! అయితే పవర్‌ప్లేలో పృథ్వీషాను మించి ధాటిగా బ్యాటింగ్‌ చేసేవాళ్లు లేరు. ఒకవేళ ముగ్గురూ ఆడితే కిషన్‌ వన్‌డౌన్లో, సూర్య సెకండ్‌ డౌన్‌లో రావాల్సిందే. ఫ్యాన్స్‌ స్కై మెరుపుల కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్ త్రిపాఠి, దీపక్‌ హుడా గురించి తెలిసిందే. బ్యాటింగ్‌ విభాగమైతే భీకరంగానే ఉంది.


కుర్ర బౌలర్లు


పేస్‌ ఏస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు గ్యారంటీ! కుర్రాడు శివమ్‌ మావికి వరుసగా అవకాశాలు ఇస్తుండొచ్చు. అర్షదీప్‌ సింగ్‌ ఎలాగూ ఉన్నాడు. అదనంగా హార్దిక్‌ పాండ్య పేస్‌ బౌలింగ్‌ వేస్తాడు. దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు కాబట్టి కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌లో ఒక్కరికే చోటు దక్కుతుంది. వైవిధ్యం కావాలనిపిస్తే వన్డేల్లో ఫామ్‌ చూపించిన కుల్‌దీప్‌కు చోటిస్తారు. ప్రస్తుతానికి కూర్పు పరంగా టీమ్‌ఇండియాకు ఇబ్బందులేం లేవు.


కేన్‌ లేని కివీస్‌


న్యూజిలాండ్‌ సైతం సీనియర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. భారత పిచ్‌లపై కొట్టిన పిండి కేన్‌ విలియమ్సన్‌ లేడు. బంతిని స్వింగ్‌ చేస్తూ అల్లాడించే టిమ్‌ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ లేరు. దాంతో బిన్‌ లిస్టర్‌, టిక్నర్‌, షిప్లే, డఫీపై ఆధారపడుతోంది. లాకీ ఫెర్గూసన్‌ ఒక్కడికే మంచి అనుభవం ఉంది. ఇష్‌ సోధి ఫిట్‌నెస్‌ సాధించడం వారికి శుభసూచకం. శాంట్నర్‌ ఎలాగూ స్పిన్‌తో రాణించగలడు. బ్యాటింగ్‌లో ఫిన్‌ అలెన్‌పై కివీస్‌ చాలా ఆశలు పెట్టుకుంది. పవర్‌ప్లేలో అతడు చుక్కులు చూపించగలడు. డేవాన్‌ కాన్వే మంచి బ్యాటర్‌. చాప్‌మన్‌, ఫిలిప్స్‌, మిచెల్‌, బ్రాస్‌వెల్‌లో ఎవరు నిలిచినా పరుగుల వరదే. పైగా శాంట్నర్‌ కెప్టెన్సీ అందుకున్నాక బ్యాటు, బంతితో రాణిస్తున్నాడు. నాయకత్వమూ బాగుంది. అయితే అతడి సారథ్యంలో కివీస్‌ గెలిచింది నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ పైనే.


ఛేదనే బెస్ట్‌


రాంఛీ ఛేదన జట్లకు అనుకూలిస్తుంది. అందుకే టాస్‌ గెలిచిన జట్లు బౌలింగ్‌కే ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ 25 టీ20లు జరిగితే 16 ఛేదన జట్లే గెలిచాయి. రెండో ఇన్నింగ్సులో మంచు కీలకంగా మారుతుంది. సాయంత్రం చల్లగా ఉంటుంది. 15 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. ఈ వేదికలో టీమ్‌ఇండియా ఇప్పటి వరకు ఆడిన మూడు వన్డేల్లో విజయం అందుకుంది. 2021లో కివీస్‌నూ ఓడించింది. సొంత మైదానం కావడంతో ఇషాన్‌ కిషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.


టీ20 సిరీస్ జట్లు:


భారత్‌: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ హుడా, ఇషాన్‌ కిషన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముకేశ్ కుమార్‌, జితేశ్ శర్మ, పృథ్వీ షా, శివమ్‌ మావి, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, ఉమ్రాన్‌ మాలిక్‌, వాషింగ్టన్‌ సుందర్‌


న్యూజిలాండ్‌: మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, బ్రాస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేన్‌  క్లీవర్‌, డేవాన్‌ కాన్వే, జాక్‌ డఫి, లాకీ ఫెర్గూసన్‌, బెంజమిన్‌ లిస్టర్‌, డరైల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకేల్‌ రిప్పన్‌, హెన్రీ షిప్లే, ఇష్‌ సోధి, బ్లెఇర్‌ టిక్నర్‌