Ind vs Ban, 1st Test:


ఛటోగ్రామ్‌ టెస్టుపై టీమ్‌ఇండియా పట్టు బిగించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌పై ఆధిపత్యం సాధించింది. రెండోరోజే విజయానికి పునాదులు వేసుకుంది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులకు ఆలౌటైన భారత్‌ బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థిని భారీ దెబ్బకొట్టింది. ఆట ముగిసే సమయానికి 133/8కి పరిమితం చేసింది. మెహదీ హసన్‌ (16 బ్యాటింగ్‌; 35 బంతుల్లో 1x4, 1x6), ఇబాదత్‌ హుస్సేన్‌ (13 బ్యాటింగ్‌; 1x4, 1x6) అజేయంగా నిలిచారు. బంగ్లా 271 పరుగుల లోటుతో ఒత్తిడిలో పడిపోయింది. కుల్‌దీప్‌ యాదవ్‌ 4, మహ్మద్‌ సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టారు.


తొలి సెషన్‌ అశ్విన్‌దే!


ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 278/6తో రెండో రోజు, గురువారం రాహుల్‌ సేన బ్యాటింగ్ ఆరంభించింది. 82 పరుగులతో శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. మరో 4 పరుగులే జోడించి ఇబాదత్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో ఔటై త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసిందంటే అందుకు రవిచంద్రన్‌ అశ్విన్‌ (58; 113 బంతుల్లో 2x4, 2x6), కుల్‌దీప్‌ యాదవ్‌ (40; 114 బంతుల్లో 5x4) భాగస్వామ్యమే కారణం. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను తెలివిగా అడ్డుకున్నారు.


రెండో సెషన్లో కుల్‌దీప్‌ జోరు!


యాష్‌, కుల్‌దీప్‌ జోడీ ఎనిమిదో వికెట్‌కు 200 బంతుల్లో 87 పరుగులు సాధించింది. వీరిద్దరూ కఠినమైన బంతుల్ని చక్కగా డిఫెండ్‌ చేశారు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు. దాంతో లంచ్‌ టైమ్‌కు భారత్‌ 348/7తో నిలిచింది. ఆ తర్వాత యాష్ హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. రెండు భారీ సిక్సర్లు బాదిన అతడు 91 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో మెహదీ హసన్‌ 131.2వ బంతిని  ఆడబోయి స్టంపౌట్‌ అయ్యాడు. ఆఖర్లో ఉమేశ్‌ యాదవ్‌ (15*)తో కలిసి కుల్‌దీప్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. హాఫ్‌ సెంచరీ ముందు అతడిని తైజుల్‌ ఇస్లామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో 133.5 ఓవర్లకు 404 వద్ద టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.


మూడో సెషన్లో కుల్‌దీప్‌, సిరాజ్‌ బీభత్సం


బంతిని అందుకోవడమే ఆలస్యం టీమ్‌ఇండియా బౌలర్లు ఫైర్‌ పవర్‌ చూపించారు. చురకత్తుల్లాంటి బంతులేసి బంగ్లా టైగర్స్‌ను వణికించారు. పరుగుల ఖాతా తెరవకముందే నజ్ముల్‌ హుస్సేన్‌ (0)ను మహ్మద్‌ సిరాజ్‌ ఔట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ జాకీర్‌ హుస్సేన్‌ (20)నూ అతడే పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే లిటన్‌ దాస్‌ (24)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మధ్యలో ఉమేశ్‌ యాదవ్‌.. యాసిర్‌ అలీ (4)ని ఔట్‌ చేశాడు. అతడి తర్వాత కుల్‌దీప్‌ యాదవ్‌ చెలరేగాడు. అతడు వేగంగా వేయడం లేదన్న కంప్లైంట్‌ ఉండేది. విచిత్రంగా ఈసారి కీపర్‌ రిషభ్ పంత్‌ అతడిని నెమ్మదిగా బంతులేయమని ప్రోత్సహించాడు. పిచ్‌, కండిషన్స్‌ను ఉపయోగించుకున్న మణికట్టు స్పిన్నర్ ముష్ఫికర్‌ రహీమ్‌ (28), షకిబ్‌ అల్‌ హసన్‌ (3), నురుల్‌ హసన్‌ (16), తైజుల్‌ ఇస్లామ్‌ (16)ను పెవిలియన్‌ పంపించాడు. దాంతో 44 ఓవర్లకు బంగ్లా 133/8తో నిలిచింది.