Harmanpreet Kaur:  మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్ లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 167 పరుగులకు ఆలౌటైన భారత్ 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో విజయం కోసం మన అమ్మాయిలు చివరి వరకు పోరాడారు. ఒక దశలో లక్ష్యాన్ని ఛేదించి ఆసీస్ పై గెలిచేలా కనిపించారు. అయితే అప్పటివరకు అద్భుతంగా ఆడిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చివరి ఓవర్లలో రనౌట్ కావటంతో ఫలితం తారుమారైంది. అక్కడే భారత పరాజయం నిశ్చయమైంది. 


మ్యాచ్ లో కీలక సమయంలో రనౌట్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ తన ఆవేశాన్ని, బాధను, కోపాన్ని దాచుకోలేకపోయింది. ఔటయ్యాక తన ఫ్రస్టేషన్ ను మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్ లోనూ చూపించింది. బ్యాట్ ను విసిరికొట్టింది. చివరకు జట్టు ఓడిపోవటంతో తన భావోద్వేగాన్ని అణుచుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో హర్మన్ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రెజెంటేషన్ సమయంలో హర్మన్ ప్రీత్ సన్ గ్లాసెస్ పెట్టుకుని కనిపించింది. తన కన్నీళ్లను భారత అభిమానులు చూడకూడదనే తాను కళ్లజోడు పెట్టుకున్నట్లు ఆమె వివరించింది. హర్మన్ మాట్లాడుతూ.. 'నేను కన్నీళ్లు పెట్టుకోవడం నా దేశం చూడడం నాకు ఇష్టంలేదు. అందుకే కళ్లద్దాలు ధరించాను. నేను వాగ్ధానం చేస్తున్నాను. ఇకముందు మేం మరింత మెరుగ్గా ఆడతాం. ఇంకోసారి దేశాన్ని ఇలా నిరాశపరచం' అని చెప్పింది.






నా రనౌట్ కన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు


మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో ఓటమి గురించి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. 'నేను రనౌట్ అయిన విధానం కన్నా దురదృష్టం ఇంకొకటి ఉండదు. కృషి చేయడం చాలా ముఖ్యం. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతి వరకు పోరాడడం గురించి మేం చర్చించుకున్నాం. అయితే ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. కానీ ఈ టోర్నీలో మేం ఆడిన విధానం గురించి నేను సంతోషంగా ఉన్నాను. ఈ మ్యాచ్ లో మేం ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని మాకు తెలుసు. జెమీమా బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. ఛేదనలో మాకు కావలసిన వేగాన్ని ఆమె అందించింది.' అని హర్మన్ చెప్పింది. 


భారత నాకౌట్ శత్రువు ఆసీస్


మహిళల క్రికెట్ లో ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ దశలో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓడిపోవడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు 2018, 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత్ ఆసీస్ చేతిలో ఓడిపోయింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ లోనూ  గోల్డ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా పరాజయం పాలైంది.


ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భారత పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 2017 ఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవటంతో మొదలైన ఈ చరిత్ర.. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కప్పు కల కలగానే మిగిలిపోయింది.