భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో రెండో రోజు భారత్ పైచేయి సాధించింది. మొదటి సెషన్‌లోనే నాలుగు వికెట్లు తీసుకుంది. క్రీజులో నిలబడ్డ ట్రావిస్ హెడ్ (163: 174  బంతుల్లో, 25 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవ్ స్మిత్ (121: 268 బంతుల్లో, 19 ఫోర్లు) అవుట్ కావడం టీమిండియాకు పెద్ద ఉపశమనం. రెండో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ (22 బ్యాటింగ్: 43 బంతుల్లో, మూడు ఫోర్లు), మిషెల్ స్టార్క్ (2 బ్యాటింగ్: 17 బంతుల్లో) ఉన్నారు. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియాను 500 పరుగుల్లోపు కట్టడి చేస్తే టీమిండియాకు కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.






మొదటి మూడు బంతుల్లోనే...
రెండో రోజు ఆట ప్రారంభం అయిన మొదటి మూడు బంతుల్లోనే స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 95 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్... మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్ రెండు, మూడు బంతులను బౌండరీలుగా తరలించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా 150 పరుగుల మైలురాయిని దాటాడు.


హెడ్‌ను పడగొట్టిన సిరాజ్...
ఆట ప్రారంభం అయ్యాక ఏడో ఓవర్లో ట్రావిస్ హెడ్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ పుల్ షాట్ ఆడబోయిన హెడ్... వికెట్ కీపర్ కేఎస్ భరత్ చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌కు వీరిద్దరూ జోడించిన 285 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది. భారత్‌కు ఊరట కలిగింది. ఆ తర్వాత కాసేపటికే కామెరాన్ గ్రీన్ (6: 7 బంతుల్లో, ఒక ఫోర్), స్టీవ్ స్మిత్ కూడా అవుటయ్యారు.






కానీ మిషెల్ స్టార్క్, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ కలిసి స్కోరును 400 మార్కు దాటించారు. అయితే క్యారీతో సమన్వయ లోపం కారణంగా మిషెల్ స్టార్క్ (5: 20 బంతుల్లో) రనౌట్ అయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి అలెక్స్ క్యారీ మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు.